జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 6: జగిత్యాల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 10, 26, 39 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు రూ.22.70 ల క్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులకు మున్సిపల్ అధ్యక్షురాలు బోగ శ్రావణితో కలిసి ఆదివారం ఎమ్మెల్యే భూ మిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.4కోట్లతో 2 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణంలో ఇండ్ల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో రూ.2 కోట్లతో సబ్స్టేషన్ ఏర్పాటు చేశామని, సుమారు 600 కరెంట్ పోల్స్ వేశామని తెలిపారు. పట్టణ శివార్లలోని మార్కెట్లు, పార్కులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, వాటిని అతి త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం బోగ శ్రావణి మాట్లాడుతూ, పట్టణానికి పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలందరూ సహకరించాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని కోరారు. ఎమ్మెల్యే సహకారంతో పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సిరికొండ భారతి- రాజయ్య, సమీండ్ల వాణి-శ్రీనివాస్, ఆస్మా అంజుం, పంబాల రాము, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, నాయకులు బాలె శంకర్, అల్లాల ఆనంద్ రావు, ఆరుముళ్ల పవన్, గుమ్ముల అంజయ్య, బండారి విజయ్, చిక్కుల భూమయ్య, మహేశ్, శ్రీను, డీఈ రాజేశ్వర్, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపెల్లికి చెందిన బీ రాజేశ్కు మంజూరైన రూ.26వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు, జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామానికి చెందిన పల్ల రాజేశ్ యాదవ్కు మంజూరైన రూ.50వేల విలువ గల చెక్కును జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య శ్రీలో లేని పలు వ్యాధులకు వివిధ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ఆర్థికసాయం మంజూరవుతుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఎల్వోసీలను సైతం అందజేస్తున్నట్లు వివరించారు.
పరామర్శ
పట్టణానికి చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ గౌరిశెట్టి లవకుమార్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, నాయకుడు బోగ ప్రవీణ్ పాల్గొన్నారు.