జగిత్యాల, ఫిబ్రవరి 21: బంజారాల అభివృద్ధిపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ జీ రవి పేర్కొన్నారు. సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి సందర్భంగా సోమవారం జగిత్యాలలోని బంజారా భవన్ స్థలంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నదని తెలిపారు. జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందని, బంజారా జనాభా ప్రాతిపదికన జిల్లాకు సదరు నిధులు అందుతాయని కలెక్టర్ పేరొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గిరిజన యువత ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తండాల్లో తాగునీటి సమస్య పరిషరించిందన్నారు. నియోజకవర్గ నిధులు, సబ్ ప్లాన్ నిధులు, మున్సిపల్ నిధులు వినియోగిస్తూ జగిత్యాలలో బంజారా భవనం, ప్రహరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లాలో త్వరలో గిరిజనులకు రెసిడెన్షియల్ వసతి గృహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కలెక్టర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. వారికి 12 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యామ్ నాయక్, డా. దశరథ్ నాయక్, జడ్పీ సీఈవో సుందర వరద రాజన్, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.