జగిత్యాల, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : నాలుగు విడుతలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రతి నెలా నిధులు విడుదల అవుతుండడంతో ప్రధాన అవసరాలైన పారిశుధ్య నిర్వహణ, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు చెల్లింపు, మొక్కల పెంపకం వంటి వాటికి ఇబ్బందులు లేకుండాపోయాయి. అంతే కాకుండా ఈ నిధులతో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్డులు, డంప్యార్డులు, ప్రకృతివనాలు ఏర్పాటయ్యాయి. చెత్తను తొలగించి, డంప్యార్డుకు తీసుకెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీ, ట్రై సైకిల్స్, మొక్కలకు నీరు పట్టేందుకు వాటర్ ట్యాంకర్ను ప్రతి గ్రామం సమకూర్చుకున్నది. నిధుల్లో పదిశాతం గ్రీన్ బడ్జెట్గా ప్రకటించడంతో నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్ల ఏర్పాటు, నాటిన మొక్కల రక్షణ, నీటి సరఫరాకు వీటిని వినియోగిస్తున్నారు.
అభివృద్ధికి c/o భూపతిపూర్
పల్లె ప్రగతి కార్యక్రమంతో రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. 1439 మంది పురుషులు, 1535 మంది మహిళలతో మొత్తంగా 2974 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ఒకప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియని నిధులు.. ఏడాదికోకసారి జమయ్యే జనరల్ ఫండ్తో కనాకష్టంగా మనుగడను సాగించింది. 970 నివాస గృహాలతో గణనీయస్థాయిలో ఉన్నప్పటికీ పారిశుధ్య కార్మికులకు సరిగా వేతనాలు రాక, విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిధులు లేక ,అభివృద్ధి పనులకు అవకాశాలు లేక అవస్థలు పడింది. 2019 సెప్టెంబర్లో చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా జనాభా ప్రాతిపదికన గ్రామానికి ప్రతి నెలా 3.92 లక్షల చొప్పున ఏడాదికి రూ.48.53 లక్షల నిధులు నేరుగా రావడం ఆరంభమైంది. వీటితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టడం ప్రారంభించారు. ఇందులో పది శాతం రూ.5 లక్షలు గ్రీన్ బడ్జెట్గా కేటాయించారు. వీటితో నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. రూ.6.12 లక్షలు ఆరుగురు పారిశుధ్య కార్మికులకు వేతనాల కింద చెల్లించారు. ఒక ట్రాక్టర్ను, ట్రాలీని, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. ట్రాక్టర్కు ఏడాదికి రూ.2.40 లక్షల చొప్పున కిస్తీ చెల్లిస్తున్నారు. వీటితో పాటు మూడు ట్రైసైకిళ్లను సమకూర్చుకున్నారు. తడి, పొడిచెత్తను పోగు చేసేందుకు 1940 బుట్టలను ఇంటింటా పంపిణీ చేశారు. కీలకమైన చోట్ల తడి, పొడిచెత్తను వేసేందుకు వేరువేరుగా చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎకరంలో రూ. 6.50 లక్షలతో పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పల్లెకు నిదర్శనంగా నిలిచే నాగలి, మంచె, బావి వంటి వస్తువులతో నందనవనంలా తీర్చిదిద్దారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, స్నానపు గదులను పూర్తి చేశారు. రూ.2 లక్షలతో కంపోస్ట్ షెడ్ను నిర్మించారు. దానిపక్కనే పెద్ద డంప్యార్డ్ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. భవనం ముందు ఏర్పాటు చేసిన నాలుగు సింహాల స్తూపం నమూనా ఆకట్టుకుంటున్నది. మొదటి దఫా నిర్వహించిన పల్లెప్రగతిలో 25 కొత్త విద్యుత్ స్తంభాలను అమర్చారు. మరో 20 స్తంభాలను తొలగించి వాటిస్థానలో కొత్తవి వేశారు. మొత్తంగా భూపతిపూర్ గ్రామం నేడు ఒక సకల సౌకర్యాలు సంతరించుకుని అభివృద్ధికి కేరాఫ్గా నిలిచింది.
జగిత్యాల గ్రామాల్లో కొత్తందాలు..
జిల్లాలోని 18 మండలాల పరిధిలో 380 గ్రామ పంచాయతీలున్నాయి. వీటన్నింటికీ ప్రతి నెలా రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి నేరుగా నిధులు మంజూరవుతున్నాయి. సగటున జిల్లాకు నెలకు రూ.6.90 కోట్లు వస్తుండగా, గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. 28 నెలల కాలంలో జిల్లాకు రూ.193 కోట్లు మంజూరయ్యాయి. ప్రతి నెలా వస్తున్న నిధులతో 1,461 కిలోమీటర్ల పొడువున ఉన్న అంతర్గత రోడ్లు, 907 కిలోమీటర్ల పొడవున ఉన్న మురుగు కాలువలు నిరంతరం శుభ్రమవుతున్నాయి. ఇందు కోసం పంచాయతీలు 500ల జనాభాకు ఒక్క పారిశుధ్య కార్మికుడిని సగటున నియమించుకున్నాయి. మొక్కల కోసం గతంలో కేవలం 40 గ్రామాల్లో నర్సరీలు ఉండగా, ఇప్పుడు అన్ని గ్రామాలతో పాటు హామ్లేట్ గ్రామాల్లోనూ ఏర్పాటయ్యాయి. 1683 కిలోమీటర్ల పొడవునా 2,19,089 గుంతలు తీసి మొక్కలు నాటారు. మొత్తంగా 420 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు కాగా, ఇందులో నాటిన 7.70 లక్షల మొక్కలతో ఉద్యానవనాలుగా మారిపోయాయి. ప్రభుత్వం నెలనెలా ఇచ్చే నిధులతో పాటు, ఉపాధిహామీ పథకాన్ని పల్లె ప్రకృతి వనాల నిర్మాణానికి అనుసంధానం చేశారు. 377 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తయ్యాయి. తడి, పొడి చెత్తను వేరు చేసుకునేందుకు అన్ని గ్రామాల్లో 79,078 బుట్టలను పంపిణీ చేశారు. చెత్తను వేసేందుకు ఒక డంపింగ్యార్డును, తడి, పొడి చెత్తల నుంచి కంపోస్ట్ తయారు చేసేందుకు కంపోస్ట్ షెడ్లను రూ.7.77 కోట్ల అంచనాలతో 379 గ్రామాల్లో కంపోస్ట్షెడ్లను నిర్మించారు. కొన్ని గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లలో సేంద్రియ ఎరువును తయారు చేస్తూ నర్సరీల్లో పెంచే మొక్కలకు వినియోగిస్తున్నారు. పల్లెప్రగతిలో భాగంగా పాడుబడిన బావులను, నీరు నిల్వ ఉండే గుంతలను పూడ్చివేశారు. ముళ్లపొదలను, శిథలమైన భవనాలను పూర్తిగా తొలగించారు. 2612 చోట్ల లూజ్వైర్లను సరిచేశారు. పాడయిన 4276 పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చారు. వంగిపోయిన వెయ్యి స్తంభాలను మార్చివేశారు. తుప్పుపట్టిన 246 స్తంభాలను తొలగించి కొత్తవి వేశారు. వీటితో పాటు 2500లు కొత్తవి వేశారు. 9356 ఎల్ఈడీ బల్బులను అమర్చారు. 5299 గృహాలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. ఇలా విద్యుత్ సమస్యలను చాలా వరకు సంస్కరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 493 మంది దాతలు రూ.48.83 లక్షలు విరాళాలుగా పంచాయతీలకు అందించారు. మొత్తంగా జిల్లాలో గ్రామాలు కొత్త అందాలను క్రమంగా సంతరించుకుంటున్నాయి.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
పల్లె ప్రగతి ద్వారా వచ్చిన మార్పుతో పల్లె నేడు పచ్చందాల కోకలా మారింది. పల్లెల చరిత్రను రాస్తే.. పల్లె ప్రగతికి ముందు.. తరువాత అని చెప్పాల్సి వస్తుంది. ప్రతి నెలా నిధులు ఠంఛన్గా వస్తుండడం, ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పల్లెలు ప్రగతి బాటపట్టాయి. జిల్లాలో 380 మంది కార్యదర్శుల నేతృత్వంలో 1534 మంది పారిశుధ్య కార్మికులు నిరంతరం గ్రామాల బాగు కోసం శ్రమిస్తున్నారు. డీఎస్ఆర్ యాప్ ద్వారా నిరంతరం అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. పచ్చదనం పరిశుభ్రత, బ్లీచింగ్ వంటి కార్యక్రమాలతో అంటురోగాలు, విషజ్వరాలు తగ్గిపోయాయి. నర్సరీలు, ప్రకృతివనాలు గ్రామ వాతవరణాన్నే మార్చివేశాయి. వైకుంఠధామాల ఏర్పాటు గొప్ప విప్లవాత్మకం. ట్రాక్టర్, ట్రాలీలు సమకూరడం వల్ల చెత్త శుభ్రం చేయడం సులువైంది. ఎవెన్యూ ప్లాంటేషన్ను చూసే గ్రామ పరిస్థితిని చెప్పే స్థితికి వచ్చేశాం. పల్లె ప్రగతి తెలంగాణ పల్లెల పాలిటి అమృతవల్లి అనడంలో సందేహం లేదు.
– హరికిషన్, జిల్లా పంచాయతీ అధికారి (జగిత్యాల)