జగిత్యాల, నవంబర్ 24: నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా గురువారం కలెక్టర్ డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూకపెల్లి అర్బన్ కాలనీలో 4,560 గృహాలు, 510 ఇండ్లు అన్ని విధాలుగా పూర్తయ్యాయని, మౌలిక వసతులైన నీటి వసతి, విద్యుత్ సదుపాయం, సీనరేజ్ పనులకు టెండర్లు నిర్వహించి డిసెంబర్ 25వ తేదీ వరకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ విషయమై సంబంధిత కాంట్రాక్టర్లు పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. అదే విధంగా 4000 గృహాల్లో 2000 ఇండ్లు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని, జనవరి చివరి వరకు మిగిలిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించడానికి రూ.5కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత, పీఆర్ఈఈ రెహమాన్, డిప్యూటీ ఈఈలు జే రాజేశ్వర్, మిలింద్, కాంట్రాక్టర్లు రుషికేశ్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై సమీక్ష
డబుల్ బెడ్రూం ఇండ్ల పు రోగతి, లబ్ధిదారుల ఎంపిక, ధరణి, భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మ, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంత రం అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో డబుల్ బె డ్రూం ఇండ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన ఇండ్ల సంఖ్య, టెండర్ పూర్తయినవి, నిర్మాణం ప్రారంభమైనవి వంటి అంశాలపై నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, ఎం మకరంద్, పాల్గొన్నారు.