పెగడపల్లి, నవంబర్24: సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళికతో రాష్ట్రంలో ఈ ఎనిమిదేళ్లలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెగడపల్లి మండలం ఎల్లాపూర్- ల్యాగలమర్రి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతినగా గురువారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా దారి మరమ్మతు పనులు త్వరలో చేపట్టి రెండు గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ది పథంలో దూసుకుపోతున్నాయనీ, ముఖ్యంగా పల్లెప్రగతి పథకంతో అద్భుతమైన అభివృద్ధి సాధించాయన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటు, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు, హరితహారం మొక్కలు నాటడం, డంప్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు, ఇంటింటికీ చెత్త సేకరణ వంటి పనులతో పల్లెల రూపురేకలు పూర్తిగా మారాయన్నారు. అనంతరం లింగాపూర్కు చెందిన కానిస్టేబుల్ రమణాచారి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే గ్రామంలో పలు బాధిత కుటుంభాలను మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, సర్పంచులు వనజ, లక్ష్మీ, ఎంపీటీసీలు రవీందర్, అంజయ్య, ఆర్బీఎస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మండల నాయకులు సురేందర్రెడ్డి, కరుణాకర్రావు, ఆనందం, ఆంజనేయులు, వీరేశం, శ్రీనివాస్గౌడ్, తదితరులు ఉన్నారు.