జగిత్యాల, జూలై 3: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని, గతంలో ఉన్నత వర్గాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందేది కాదని గుర్తు చేశారు. నేడు కల్యాణ లక్ష్మి లాంటి పథకం, రైతు బంధు సాయం ఉన్నత వర్గాలకు అందుతున్నదన్నారు. కేంద్రం రిజర్వేషన్ ప్రకటించినా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న 88 మంది విద్యార్థులకు రూ.3,13,000 విలువైన ఉపకార వేతనాలను అందించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కేడీసీసీ సభ్యుడు రాంచందర్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రమణారావు, మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రావు, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు దామోదర్రావు, పద్మనాయక సంక్షేమ మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
జగన్నాథ స్వామి ఆలయంలో పూజలు
సారంగాపూర్, జూలై 3: రేచపల్లి గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో శ్రీ సుదర్శన హోమం, హయగ్రీవ హోమం నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భూదేవీ నీలాదేవీ సమేత జగన్నాథ స్వామి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు శ్రీనివాసాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, జడ్పీటీసీ మేడిపెల్లి మనోహర్ రెడ్డి, సర్పంచ్ ఎడమల జయ, ఎంపీటీసీ భూక్యా లావణ్యా రాథోడ్, ఉప సర్పంచ్ రాచకొండ రాజేశం, టీఆర్ఎస్ గ్రామ శాఖాధ్యక్షుడు సాతల్ల రమేశ్, నాయకులు తోడేటి శేఖర్ గౌడ్, ఎడమల లక్ష్మారెడ్డి, ఒడ్నాల జగన్, కరబూజ మల్లేశం, అర్చకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
జగిత్యాల రూరల్, జూలై 3: హబ్సీపూర్ గ్రామానికి చెందిన పీ జమునకు మంజూరైన రూ.38వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, అల్లీపుర్ ప్యాక్స్ చైర్మన్ రాజలింగం, గుమ్ముల అంజయ్య, కార్మిక విభాగం అధ్యక్షుడు తొలిప్రేమ శ్రీనివాస్, చిరంజీవి పాల్గొన్నారు.