జగిత్యాల, ఫిబ్రవరి 7: మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్ర గ్స్, గంజాయి, గుడుంబా వంటి మాదకద్రవ్యాల నిర్మూలనపై కలెక్టర్ సోమవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎవరినీ ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వాడకం గ్రామ స్థాయిలో సైతం ఉండడం విచారకరమని, విద్యార్థులు మాదకద్రవ్యాల మత్తులో పడి భవిష్యత్తు పాడు చేసుకోవడంపై కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి సాగు చేసే వారిని గుర్తించి అత్యంత కఠిన చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల వ్యసనం ఉన్న వారిని గుర్తించాలని సూచించారు. ఇందుకు ఎక్సైజ్, పోలీస్ శాఖలు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని చెప్పారు. జిల్లాలోని అన్నివిద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల ద్వారా మాదకద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించాలని, మాదక ద్రవ్యాలు వాడే విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. పాఠశాలలో వ్యత్యాసంగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించి, దానికి గల కారణాలను విచారించాలని, మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు తెలిస్తే వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించాలని, సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న ఎస్పీ సింధూశర్మ మాట్లాడుతూ, జిల్లాలో ప్రాథమికంగా ఉన్న డ్రగ్స్, గంజాయి సమస్యను గుర్తించి వెంటనే పరిషరించాలని, లేనిపక్షంలో సమస్య తీవ్రతరం అవుతుందని అన్నారు. గంజాయి హాట్ స్పాట్లను గుర్తించాలని, గంజాయి వాడుతున్న వారి, సరఫరా చేస్తున్న వారి సమాచారాన్ని ప్రజలు సైతం సమీప పోలీసులకు లేదా ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని కోరారు. జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖ సమన్వయంతో సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్ఆర్డీవో ఆర్డీ మాధురి, డీఎస్పీ ప్రకాశ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, డీఎంహెచ్వో, డీపీవో, డీఈవో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రిన్సిపాళ్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.