గొల్లపల్లి, జూన్ 28: పంట మార్పిడిలో భాగంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పాం సాగు చేస్తే రైతుల భవిష్యత్తు బాగుంటుందని, అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ గుగులోతు రవి పేర్కొన్నారు. మంగళవారం అబ్బాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఆయిల్ పాం నర్సరీని సందర్శించి వ్యవసాయ, ఉద్యానవన అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయిల్ పాం సాగులో అంతర పంటలను సైతం సాగు చేయవచ్చని, అందుకు ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఎకరాకు రూ.4200 సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు డ్రిప్ సౌకర్యాన్ని సబ్సిడీపై అందజేస్తున్నామని, జిల్లాలో పది వేల ఎకరాల సాగు లక్ష్యంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పాం సాగు చేసిన నాల్గో సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని వివరించారు. మార్కెటింగ్కు సైతం ఇబ్బంది లేదని, ప్రస్తుతం టన్ను ఆయిల్ పాంకు రూ.23వేల వరకు ఉందన్నారు. రానున్న రోజుల్లో ధర పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందులో అంతర పంటలుగా శ్రీగంధం, కూరగాయల తోటలను సాగు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్, డీఏవో సురేశ్, జిల్లా పర్యవేక్షణ అధికారి లత, డీఎఫ్వో వెంకటేశ్వర్ రావు, ఎల్డీఎం వెంకట్ రెడ్డి, జగిత్యాల ఏడీఏ కల్పన, ఏవో కరుణ, లోహియా కంపెనీ ఎండీ పద్మనాభం, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాలపై సమీక్షా సమావేశం
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్, రుణ లక్ష్యాలు తదితర అంశాలపై కలెక్టర్ రవి జిల్లా కేంద్రంలోని వీకేబీ ఫంక్షన్ హాల్లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురోగతి తదితర అంశాల ను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో డిజిటల్ పేమెంట్స్ అధికంగా ఉండేలా చూడాలని కోరారు. జిల్లాలో ఉన్న 122 బ్యాంకు బ్రాంచీలు ప్రతి మూడో శుక్రవారం తప్పనిసరిగా ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక అవగాహన క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లీడ్ బ్యాంక్ అధికారులు జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించి కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ పొన్నం వెంకట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ అరుణ్ కుమార్, ఆర్బీఐ ఎల్డీవో అనిల్కుమార్, నాబార్డు డీడీఎం మనోహర్ రెడ్డి, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ ఫణి శ్రీనివాసులు, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ, టీజీబీ ఆర్ఎం గంగాధర్, యూబీఐ చీఫ్ మేనేజర్ గౌతం లక్ష్మీనారాయణ, డీఆర్డీవో వినోద్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, వివిధ బ్యాంకుల, ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.