జగిత్యాల రూరల్, జూన్ 28: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు పెట్టుబడి సాయం అందజేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట్, మోతె గ్రామాల్లో పల్లె ప్రకృతి వ నం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డులను ఎమ్మెల్యే సంజ య్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మంగళవారం ప్రారంభించారు. జగిత్యాల రూరల్ మండల వెల్దుర్తి గ్రామంలో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం వర్షాకాలం రైతుబంధు సాయం విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెల్దుర్తి, గొల్లపల్లె, అంతర్గాం, అంబారిపేట గ్రామాల్లోని 12 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, ఎనిమిది మందికి రూ.5లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి ఇంటికెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు ఇదో మంచి రోజు అని, కేంద్రం ఎంత ఇబ్బంది పెట్టినా రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు ప్రభుత్వం జమ చేసిందని, రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రైతు బాంధవుడు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. 208 దేశాల్లో రైతులకు ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తారని, రైతు పెట్టుబడి సాయం ఎకడా ఇవ్వడం లేదని, ఈ పథకం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం పాకులాడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటే టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేసున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. నేడు గ్రామాల్లో స్వచ్ఛమైన వాతావరణం కనిపిస్తున్నదని, అందుకు కారణం పల్లె ప్రగతి కార్యక్రమం అని కొనియాడారు.
రైతును రాజును చేసే దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఎలాంటి దళారులు లేకుండా రైతు బంధు, రైతు బీమా అందజేస్తున్నారని తెలిపారు. గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు ములాసపు లక్ష్మి, పాలెపు రాజేంద్ర ప్రసాద్, జడ్పీటీసీ మహేశ్, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచులు నారాయణ, గంగాధర్, జయ-రాజలింగం, స్వప్న-రాజేశ్వర్ రెడ్డి, బుర్ర ప్రవీణ్, ప్రకాశ్, చెరుకు జాన్, ఎంపీటీసీలు మల్లారెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, అర్బన్ మండల రైతు బంధు కన్వీనర్ జుంబర్తి శంకర్, ఉప సర్పంచులు నారాయణ, శేఖర్ రెడ్డి, రజిత, బుచ్చన్న, వెంకటేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.