జగిత్యాల కలెక్టరేట్, జూన్ 16: ‘ఆన్లైన్ బిజినెస్.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం చెల్లిస్తామంటూ ప్రకటనలు ఇచ్చిన సోలార్ గోల్డ్ కార్డ్ అనే ఆన్లైన్ యాప్ జగిత్యాల జిల్లాలో పెద్ద సంఖ్యలో జనాలను నిండా ముంచింది. మొత్తం 100 మందిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూడింతల ఆదాయం అంటూ బురిడీ..
1800 పెట్టుబడి పెడితే 75 రోజుల పాటు ప్రతి రోజూ 420 రాబడి, 4500పెడితే నిత్యం వెయ్యి రూపాయలు, 9500 పెడితే ప్రతి రోజూ 2500, 35వేలకు వంద రోజుల పాటు ప్రతి రోజు 1400 చెల్లిస్తాం. గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిలో సగం మొత్తం చెల్లిస్తామంటూ సోలార్ గోల్డ్ కార్డ్ అనే ఆన్లైన్ యాప్ నుంచి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ వాట్సాప్కు లింకు వచ్చింది. దానిని చూసిన సదరు వ్యక్తి, నిజమేనని నమ్మి లింకు ఓపెన్ చేశాడు. వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయగానే సోలార్ గోల్డ్ కార్డ్ 155వ వాట్సప్ గ్రూపులో చేరిపోయాడు. ఆ తర్వాత ఫోన్ పే ద్వారా 480 పెట్టుబడి పెట్టాడు. యాప్లో చూపిన విధంగానే సదరు వ్యక్తి ఫోన్ పే వాలెట్లో ప్రతి రోజూ 120 జమయ్యాయి. దీంతో యాప్పై సదరు వ్యక్తికి నమ్మకం కుదిరింది. దీంతో ఏప్రిల్ 27న 75రోజుల కాలపరిమితితో 13,500 పెట్టుబడి పెట్టగా దీనికి సైతం ప్రతి రోజూ 400 జమకావడం ప్రారంభమైంది. దీంతో సదరు వ్యక్తికి యాప్పై మరింత నమ్మకంతో పాటు అత్యాశ పెరిగింది. మే 5న రూ.35వేలు పెట్టుబడి పెట్టగా, మరుసటి రోజు నుంచి ప్రతి రోజు 1400 జమకావడం మొదలైంది.
మూడు సార్లు పెట్టుబడి పెడితే క్రమం తప్పకుండా యాప్ వారు డబ్బులు చెల్లిస్తుండడంతో మే 12న అప్పు తెచ్చి మరీ 1.52లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి ప్రతి రోజూ 7200 రావాల్సి ఉండగా, ఆరు రోజుల పాటు చెల్లించిన యాప్ నిర్వహకులు 19వ తేదీ నుంచి నిలిపివేశారు. సర్వర్ ప్రాబ్లం ఉంది, పలువురు బ్యాంకు సిబ్బంది సెలవులో ఉన్నారు. మే 23 నుంచి ప్రతి ఒక్కరికి యధావిధిగా చెల్లిస్తామంటూ మెసేజ్లు పంపారు. మే 23న యాప్లోకి లాగిన్ కాగా, యాప్ను క్లోస్ చేసినట్లుగా అందులో ఉండడంతో సదరు వ్యక్తి కంగుతిన్నాడు. లబోదిబోమంటూ యాప్లో పెట్టుబడులు పెట్టిన పలువురిని సంప్రదించగా, తాము సైతం ఇలాగే మోసపోయామని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు. ఇలా ఈ ఒక్క వ్యక్తే కాదు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వంద మంది పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా జగిత్యాల, మల్యాల మండలాల్లో ఈ యాప్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పెట్టుబడి దారుల వాట్సప్ గ్రూపు నంబర్లు 450కి పైగా ఉన్నట్లు తేలగా, మోసం గురించి ఎవరికీ చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక బాధితులు లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తున్నది.