జగిత్యాల, మే 31 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న చేస్తూ రైతన్నలకు అన్ని విధాలా అండగా నిలుస్తుండడం చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హితవు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం మొండికేస్తే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కన్నా రెట్టింపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నదన్నారు. రూ.4వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా తెలంగాణ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యంలో ఎలాంటి కోత విధించవద్దని రైస్ మిల్లర్లను ఆదేశించామన్నారు. అయినా కొన్నిచోట్ల మిల్లర్లు తరుగు పేరిట కోత విధిస్తున్నట్లు తమ దృష్టికి రాగానే… కోత విధించే మిల్లర్లపై, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు.
ప్రభుత్వం తరుగు తీయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, రైతులు గాబరా పడి తరుగుకు ధాన్యం విక్రయించుకోవద్దని సూచించారు. రైస్ మిల్లర్లు దోపిడీని ఆపాల్సిందేనని, సంబంధిత అధికారులను నిలదీసే విషయంలో జీవన్ రెడ్డితో కలిసి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే ముఖ్యమంత్రిని పట్టుకుని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుర్మార్గుడని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత జీవన్రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. పెట్టుబడులు తెచ్చేందుకు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళ్తే దాన్ని సైతం విమర్శించడం జీవన్ రెడ్డికే చెల్లిందన్నారు. కేటీఆర్ కృషి వల్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక కార్పొరేట్ కంపెనీలు తెలంగాణలో తమ సంస్థలను స్థాపించేందుకు ముందుకు వస్తున్న విషయం జీవన్రెడ్డికి కనిపించడం లేదా అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ప్రశ్నించారు.
యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం బహుళజాతి కంపెనీలను ఆహ్వానిస్తుంటే, జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. దేశంలోని రైతులకు అన్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొస్తే వాటిని రద్దు చేసేదాకా ఆందోళన నిర్వహించి ప్రాణాలు కోల్పోయిన రైతు అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు బీమా సౌకర్యం లేకపోవడం వల్లే, కేంద్ర నల్లచట్టాలకు వ్యతిరేక పోరాటం జరిపి, అసువులు బాసిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్థిక సా యం అందజేశారన్నారు. ఆర్థిక సాయం అందజేయడాన్ని సైతం తప్పుపట్టడం శోచనీయమన్నా రు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో చెరువులు, కుంటలు అభివృద్ధి అయ్యాయని, మూడున్నరేళ్లలో కాళేశ్వరం పూర్తయి ఎటు చూసినా జలమే కనిపిస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నేతలు గొంతు చించుకుంటున్నారని ఎమ్మెల్యే సంజయ్ దుయ్యబట్టారు.