జగిత్యాల, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘ఏడాదికి పైగా రైతాంగం చేస్తున్న పోరాటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో చేపట్టిన మహాధర్నాతో కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేసింది’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఉద్ఘాటించారు. ఈ చట్టాలను సమర్థిస్తూ ఇష్టారీతిగా మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ అధికారం చేపట్టిన వెంటనే అన్నదాత సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం సహా 23 ప్రాజెక్టులు నిర్మించారన్నారు. రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేసి అండగా నిలిచారని చెప్పారు. సమైక్య పాలనలో వట్టిపోయిన చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించారని, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతుల బతుకుల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. తెలంగాణ రైతులను నిండా ముంచేందుకు కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనబోమని తొండిపెట్టిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం.. రైతు చట్టాలతో వారిని కూలీలుగా మార్చిందని ఎద్దేవా చేశారు.
రైతుల పొట్టగొట్టి కార్పొరేట్లకు దోచిపెడుతుందని మండిపడ్డారు పంజాబ్లో పండిన వరిని ఎలా కొంటారు, తెలంగాణలో పండిన వరిని ఎందుకు కొనరో ప్రధాని చెప్పాలన్నారు. దేశంలో ఏటా రూ.75 వేల కోట్ల నూనె ఉత్పత్తులు, నూనెను దిగుమతి చేసుకుంటున్నామని, ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన కేంద్రం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పాలకులు వరద కాలువను తవ్వి వదిలిపెట్టారని, సీఎం కేసీఆర్ వరద కాలువకు తూములు పెట్టి చెరువుల్లోకి నీటిని మళ్లించారన్నారు. కాళేశ్వరం కట్టి, వరద కాలువను సజీవ నదిలా మార్చివేశారన్నారు. రైతుల శాపం కాంగ్రెస్, బీజేపీలకు తగులుతుందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో రూ.300 కోట్లతో సాగునీటి, చెక్ డ్యామ్ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతు సమస్యల ముసుగులో కాంగ్రెస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని విమర్శించారు. సమావేశంలో మారెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు, పీఎసీఎస్ చైర్మన్ మహిపాల్రెడ్డి ఉన్నారు.