ధర్మపురి : ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటేస్తే చీకటి రోజులే వస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు. కాంగ్రెస్ (Congress) హయాంలో కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగుచేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి, రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు.
ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం సిరికొండ, మద్దునూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దునూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం, శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టేవిధంగా రేవంత్రెడ్డి (Revanth reddy) మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పాముకాట్లకో, మిత్తీల పాట్లకో తన ప్రాంత రైతుబిడ్డలు అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతుంటే వారిని బ్రతికించుకోవాడానికి కేసీఆర్(CM KCR) వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ను అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్, రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు.
ఆరు గంటలపాటు కరెంట్ ఇస్తానన్న కాంగ్రెస్, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు (Irrigation Projects), మిషన్ కాకతీయ ( Mission Kakatiya) తో చెరువులను బాగుచేస్తూనే, మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తేనే రైతాంగం బాగుపడుతుందని అన్నారు. రైతాంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అండగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో చేరిక సిరికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గజ్జెల విజయ్ మద్దునూర్ గ్రామ కాంగ్రెస్ ఉప సర్పంచ్ ముంజాల సత్తయ్య గౌడ్ తో పాటు ఎస్సీ కాలనీ చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS )లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.