జగిత్యాల టౌన్, డిసెంబర్ 24: సీనియర్ సిటిజన్స్కు సర్కారు భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2023వ సంవత్సర డైరీలు, సీనియర్ సిటిజన్స్ పిలుపు మాసపత్రికలను మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కొప్పుల ఈశ్వర్కు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సేవలను వివరించే అభినందనల మెమోంటోను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై కేంద్రం మరిన్ని రక్షణ సవరణలు చేయకపోవడం శోచనీయమన్నారు. దేశ వ్యాప్తంగా పింఛన్లు ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్వన్గా ఉందని అన్నారు.
సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వం వృద్ధాశ్రమాన్ని నిర్మించడం, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి సీనియర్ సిటిజన్స్ దివ్యాంగుల ట్రాన్స్జెండర్స్ శాఖను వేరు చేసి ప్రత్యేకశాఖగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన సందర్భంగా మంత్రికి తమ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీఆర్ దేశాయ్, ఉపాధ్యక్షుడు పీసీ హన్మంత్రెడ్డి, ఎండీ యాకూబ్, కోశాధికారి వీ ప్రకాశ్రావు, సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉమాకాంత్కు మంత్రి అభినందనలు
చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థి ఉమాకాంత్ను మంత్రి ఈశ్వర్ శనివారం ధర్మపురిలో అభినందించారు. చొప్పదండి గురుకులంలో 6వతరగతి నుంచి ఇంటర్ వరకు చదివి పూణె నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరి పైలెట్ అధికారిగా ఎంపికై శిక్షణ తీసుకోనున్న ఆవుల ఉమాకాంత్ను మంత్రి ఈశ్వర్ శాలువా కప్పి అభినందించారు. ఇక్కడ పలువురు నాయకులున్నారు.
సీనియర్ పాత్రికేయుడికి పరామర్శ
ధర్మపురి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సంగనబట్ల రామకిష్టయ్యకు ఇటీవల గుండె శస్త్రచికిత్స జరుగగా మంత్రి ఈశ్వర్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.శ్రీకాంత్రెడ్డి తదితరులున్నారు.