మల్లాపూర్ ఆగస్టు 5: ఆరుగాలం కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం వేకువ జామున నుంచే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ సహకార సంఘం (Chittapur Co-Operative Society) పరిధిలోకి ఓ లారీలో 340 యూరియా బస్తాలు వచ్చాయి.
ఈ బస్తాల కోసం సంఘం పరిధిలోని చిట్టాపూర్, ధర్మారం గ్రామాల రైతులు తమ పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్లతో ఉదయం నుండి వేచి ఉన్నారు. ఈ క్రమంలో తమ సంబంధిత పత్రాలను క్యూ లైన్ లో పెట్టారు రైతులు. చివరకు ఒక్క రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను అందించారు. అయితే.. ఉదయం నిరీక్షించిన వాళ్లలో చాలామందికి యూరియా అందకలేదు. దాంతో, వాళ్లు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.