జగిత్యాల : జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ, ఎంసీహెచ్ దవాఖానలోని అదనపు పడకల భవన నిర్మాణ పనులను అధికారులు, గుత్తేదారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఫిబ్రవరి నెలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా ముందస్తుగా జగిత్యాలలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ పనులను కలెక్టర్ రవి పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జగిత్యాల ఆర్డీవో ఆర్డీ మాధురి, ఆర్&బి ఈఈ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదక్షణదేవి, ఆర్.ఎం.ఓ. రామకృష్ణ, సి.పి.ఓ, పూర్ణచందర్ రావు టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి. అధికారులు , తదితరులు పాల్గొన్నారు.