జగిత్యాల, డిసెంబర్ 24 : క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలు నూతనశోభను సంతరించుకున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లూర్దుమాత చర్చి, క్రిస్టియన్ కాలనీలోని వెస్లీ సెంటనరీ చర్చి, కమిషనరేట్ బంగ్లా సమీపంలోని సీఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చితోపాటు నగరంలోని పలు చర్చిలు విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. శనివారం రాత్రి నుంచే దారులన్నీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనా మందిరాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆదివారం ఆయా చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు, మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఇవేగాక పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని చర్చిలు వేడుకలకు ముస్తాబయ్యాయి.
స్వరాష్ట్రంలో ఘనంగా వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్నది. బతుకమ్మ పండుగకు అన్ని వర్గాల ఆడబిడ్డలకు చీరెలు పెడుతున్నది. అలాగే, రంజాన్ సందర్భంగా ముస్లింలకు కొత్త బట్టలు అందజేస్తున్నది. క్రిస్మస్కు క్రిస్టియన్ మైనార్టీల్లోని పేదలకు 2014 నుంచి గిఫ్ట్ ప్యాక్ (ఒక చీరె, జాకెట్, పైంట్, చొక్కాతోపాటు చుడీదార్)లు ఇస్తున్నది. ప్రతి సారి విందు భోజనాలకు ప్రతి నియోజకవర్గానికి 2లక్షల చొప్పున నిధులు ఇస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా విందు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గిఫ్ట్ ప్యాక్లు అందించారు.
భలే భలే ఎలక్ట్రిక్ క్రిస్మస్ తాత
గోదావరిఖని తిలక్నగర్కు చెందిన భగత్ ప్రశాంత్ ఎలక్ట్రిక్ క్రిస్మస్ తాతను రూపొందించి అబ్బురపరిచాడు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో కరెంట్ కేబుల్, రెండు ఎల్ఈడీ బల్బ్లు, కాటన్, మినీ ఎల్ఈడీ లైట్స్, మినీ స్విచ్ తదితర పరికరాలను వినియోగించి ఈ ప్రతిమను తయారు చేశాడు. క్రిస్మస్ తాత చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ లైట్లు వాటంతట అవే వెలిగేలా తీర్చిదిద్దాడు. అతడి ప్రతిభా సామర్థ్యాన్ని చూసి స్థానికులు అభినందిస్తున్నారు.