జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్ : జగిత్యాల మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్లో గురువారం దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశారు. సంఘ భవనంలో చేసిన దాడిలో తండ్రి, పెద్ద కొడుకు అక్కడిక్కడే మృతిచెందగా, రెండో కొడుకు దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. దాడి నుంచి చిన్న కొడుకు తప్పించుకొని బయట పడ్డాడు. సంచలనం సృష్టించిన మూడు హత్యలకు సం బంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్లోని 48వ వార్డుకు చెందిన జగన్నాథం నాగేశ్వర్రావు(60) స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటూ సెప్టిక్ క్లీనింగ్ వాహనాన్ని నిర్వహిస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కు కొడుకులు రాంబాబు(42), రాజేశ్, రమేశ్(35)తోపాటు ఓ కూతురు, రెండో భార్యకు కొడుకు, కూతురు ఉన్నారు. తండ్రి నాగేశ్వర్రావుతోపాటు పెద్ద భార్య కొడుకులైన ముగ్గురు తండ్రితో పాటే వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రతి నెలా 20న తారకరామనగర్లోని ఎరుకల సంఘ భవనంలో కుల సంఘం సమావేశం జరుగుతుంది.
దీనికి గ్రామంలోని కులస్తులందరూ హాజరవుతారు. పురుషులు ఎరుకల సంఘ భవనంలో, మహిళలు సమీపంలోని మ రో స్థలంలో సమావేశం నిర్వహించుకుంటారు. గురువారం టీఆర్నగర్లో జరిగిన కుల సంఘ సమావేశానికి నాగేశ్వర్రావు కొడుకులు రాంబా బు, రాజేశ్, రమేశ్తో కలిసి హాజరయ్యాడు. సంఘ భవనంలో సమావేశం జరుగుతుండగానే కొందరు వ్యక్తులు తండ్రి నాగేశ్వర్రావు, ముగ్గురు కొడుకులపై పదునైన ఆయుధాలతో అకస్మాత్తుగా దాడి చేశారు. నాగేశ్వర్రావును కత్తితో గొంతు కోయగా, రాంబాబు, రమేశ్ను బరిసెలతో పొడిచారు. నాగేశ్వర్ రావు, రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన రమేశ్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడాడు. నాగేశ్వర్రావు చిన్న కొడుకు రాజేశ్ను సైతం హత్య చేసేందుకు దుండగులు ప్రయత్నించగా వారి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ సీఐ, ఎస్ఐలు కృష్ణకుమార్, అనిల్ అక్కడికి చేరుకొని, రక్తంమడుగులో కొట్టుమిట్టాడుతున్న రమేశ్ను పోలీస్ వాహనంలో జగిత్యాల జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. జగిత్యాల అడిషనల్ ఎస్పీ రూపేశ్, డీఎస్పీ ప్రకాశ్ హత్యా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హత్యకు వినియోగించిన బరిసెను, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫింగర్ప్రింట్ క్లూస్ టీం వారు ఆధారాలు సేకరించారు. హత్య జరిగిన తీరుపై స్థానికుల నుంచి వివరాలు తీసుకున్నారు. దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డ నాగేశ్వర్రావు చిన్న కొడుకు భయబ్రాంతులకు గురై ధర్మపురి రోడ్డువైపు ఉన్న బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పోలీసులు అతడికి ధైర్యం చెప్పి అతడి వద్ద నుంచి వివరాలు సేకరించి ఫిర్యాదు తీసుకున్నారు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తుల గుర్తింపుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కుల సంఘ సమావేశానికి హాజరైన పలువురు వ్యక్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మంత్రాలు.. ఆర్థిక లావాదేవీలే కారణమా..?
కాగా, ఈ హత్యలకు మంత్రాలు.. ఆర్థిక లావాదేవీలు, సెప్టిక్ ట్యాంకుల నిర్వహణలో ఇతరులతో తలెత్తిన వివాదాల నేపథ్యమే కారణాలై ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేతిరి దుర్గయ్య, గంగయ్య హత్య చేశారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తుండడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాగేశ్వర్రావు అప్పులిస్తాడని, సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ చేసే వ్యవహారంలో సైతం ఆయనకు ఇతరులతో తరచూ గొడవలు జరుగుతుండేవని పలువురు చెబుతున్నారు. సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసే విషయంలో సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో గత డిసెంబర్ 17న నాగేశ్వర్రావుకు, ఇతర వ్యక్తులతో గొడవ జరుగడం, అతని కారును కొందరు ధ్వంసం చేయడంతో సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో నాగేశ్వర్రావు ఫిర్యాదు చేశాడు. అవతలి పక్షం వారు సైతం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇరు పక్షాలపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. నాగేశ్వర్రావు మంత్రాలు చేస్తాడని కొందరికి అనుమానం ఉన్నది. ఈ క్రమంలో నాగేశ్వర్రావు వద్ద అప్పులు తీసుకొని నష్టపోయిన వారు, సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ వ్యవహారంలో గొడవలు పడి కక్ష్య పెంచుకున్న వారు, మంత్రాలు చేస్తున్నాడని అనుకున్నవారు నాగేశ్వర్రావు, అతడి కొడుకులు రాంబాబు, రమేశ్ను హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉండడం, ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 48వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యక్తిని, అతడి కొడుకులను హత్య చేయడం జిల్లాలో సంచలనంగా మారింది.
నలుగురిని హతమార్చేందుకు స్కెచ్?
నాగేశ్వర్రావుతోపాటు అతడి ముగ్గురు కొడుకులను హత్య చేసేందుకు కొందరు వ్యక్తులు పక్కాగా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రతి నెలా 20న గ్రామంలో కుల సంఘం సమావేశం జరుగడం, దీనికి నాగేశ్వర్రావు అతని కొడుకులతో తప్పకుండా వస్తారని భావించి, సంఘ భవనం కాడనే నలుగురిని హత్య చేసేందుకు ప్లాన్ వేసుకుని గురువారం అమలు పరిచారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దుండగులు పదునైన ఆయుధాలతో కుల సంఘ భవనానికి చేరుకున్నట్లు, నాగేశ్వర్రావు తన కొడుకులతో లోపలికి రావడంతో కత్తులు, బరిసెలతో ఒక్కసారిగా దాడిచేసినట్లు తెలుస్తున్నది. మృతులకు సంబంధించిన వర్గానికి చెందిన 150 కుటుంబాలు టీఆర్నగర్లో నివసిస్తుండగా, వీరు మృతిచెందిన తర్వాత చాలా కుటుంబాలకు చెందిన వ్యక్తులు కనపడకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.