ప్రతి గ్రామంలో ప్రత్యేక భవన నిర్మాణాలకు నిధులు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, మే 30: రాష్ట్రంలోని కుల సంఘాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లిలో డీఎంఎఫ్టీ నిధులు రూ.9.20 లక్షలతో నిర్మించనున్న నాయీబ్రాహ్మణ, రజక సంఘాల భవన నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలను ఆదివారం మండలంలోని బూరుగుపల్లిలో టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు సుంకె అనిల్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కోల్పోయిన కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కృషి చేస్తున్నదని గుర్తు చేశారు. కుల బాంధవులు సమావేశాలను నిర్వహించుకోవడానికి ప్రతి గ్రామంలో కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, ఈ మేరకు సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధికంగా నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ గ్రామాన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డు, మిషన్ భగీరథ నీటి సరఫరా లాంటి అన్ని వసతులు కల్పించారని, పల్లెలను అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని కొనియాడారు. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, గంగాధర సింగిల్ విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, నాయకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, వేముల అంజి తదితరులు ఉన్నారు.