గోదావరిఖని, జనవరి 16: దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో దైవంలా కొలువుదీరారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శని, ఆదివారాల్లో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 28, 30, 39, 41, 12, 26, 38, 46, 49, 50వ డివిజన్లలో ఎమ్మెల్యే చందర్ నేరుగా కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. చెక్కులను అందజేశారు. 28వ డివిజన్లో మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డ పెళ్లి కన్నవాళ్లకు భారం కావొద్దనే ఉద్దేశ్యంతో దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్షా 116 అందిస్తూ పేద కుటుంబాలపై భారం తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో నగర మేయర్ డా.అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఇంజపురి పులేంధర్, ధాతు శ్రీనివాస్, బొడ్డు రవీందర్, కాల్వ స్వరూప, వేగోలపు రమాదేవి, దయాకర్, అడ్డాల గట్టయ్య, రాకుమార్, నాయకులు తానిపర్తి గోపాల్ రావు, బొడ్డు రవీందర్, జెట్టి రమేశ్, సంజీవ్, వేణు, మారుతి, మండ రమేశ్, శ్రావణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
గుండెనొప్పితో బాధపడుతున్న రోగికి సత్వర వైద్యం అందించడంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మానవత్వం చాటుకున్నారు. నగరంలోని 49వ డివిజన్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం వెళ్తున్న ఎమ్మెల్యే రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటో వద్ద ఏడుస్తున్న మహిళను గమనించి ఆగారు. స్వతంత్ర చౌక్కు చెందిన తిరుపతి అనే వ్యక్తికి గుండెనొప్పి వచ్చిందనే విషయం తెలుసుకొని సమీపంలోని సురేంద్ర నెహ్రూ హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం అతడికి ప్రాణపాయం ఏమీ లేదని డాక్టర్ భరోసా ఇవ్వడంతో అనంతరం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.