దళితబంధుతో కొత్త వెలుగులు
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్
జగిత్యాల, జూన్ 4: దళితుల ఆర్థికాభివృద్ధికే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం లేదన్నారు. జగిత్యాలలోని గాంధీనగర్లో దళితబంధు లబ్ధిదారు నక్క గంగాధర్ ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ సెంట్రింగ్ షాపును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను లబ్ధిదారుడి కుటుంబీకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఎమ్మెల్యే స్థానికంగా వినాయకుడిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తరతరాలుగా వివక్షకు గురైన దళితుల బతుకుల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు.
అర్హులందరికీ ఈ స్కీం కింద లబ్ధిచేకూరుతుందన్నారు. దళితులు ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగంకావద్దని సూచించారు. పట్టణాభివృద్ధికి నిరంతరం పరితపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా చింతకుంటలో మినీ ట్యాంక్ బండ్, పార్, ఓపెన్ జిమ్, వైకుంఠ ధామం ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి ముందుచూపుతో అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇందుకు భిన్నంగా కేంద్రం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందని మండిపడ్డారు. అధికారం మాదేనంటూ ప్రగల్బాలు పలుకుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి హయాంలో చేసిందేంటో చెప్పాలని నిలదీశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలే లతా శంకర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, హెచ్సీఏ జిల్లా డైరెక్టర్ దావా సురేశ్, బోగ ప్రవీణ్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు దామోదర్రావు, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు పవన్, వార్డు అధ్యక్షుడు కృష్ణ, యూత్ అధ్యక్షుడు గిరి ఉన్నారు.