వేములవాడ, నవంబర్ 27: నిరుపేదల భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టిన యోధుడు, పేదల మనిషి చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కొనియాడారు. చెన్నమనేని శతజయంతి వేడుకల సందర్భంగా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 7వ రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలను ఏర్పాటుచేయగా ఆదివారం ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
రాజేశ్వర్రావు శతజయంతి సందర్భంగా క్రీడలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. నిరుపేదల పక్షాన పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు అని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా, నాయకుడిగా భారతదేశంలో వీలినం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేద ప్రజలకోసమే తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్లకు గోదావరి జలాలను తేవాలనే ఆయన కలలను తనయుడు ఎమ్మెల్యే రమేశ్బాబు సారథ్యంలో సీఎం కేసీఆర్ సహకారంతో నెరవేరాయని గుర్తుచేశారు.
దేశంలోని అనేక ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, బ్యాం కులు, ఎల్ఐసీలాంటి సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించా రు. ఇకముందు రైల్వేలో మహేంద్రా, మోదీ, అదానీ లాంటి ఎక్స్ప్రెస్లు వస్తాయని విమర్శించారు. దేశానికి క్రీడాకారులు ఎంతో అవసరమని అన్నారు. స్వాతంత్య్ర భారత దేశాని కంటే తర్వాత వచ్చిన చైనాలోనే ఎక్కువమంది క్రీడాకారులు ఒలింపిక్ పతకాలు సాధిస్తున్నారన్నారు. పేదరికం, ఆర్థిక స్థితిగతులతో మనదేశం ముందుకు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, అందులో భాగంగానే అభివృద్ధి వేగవంతమైందని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రంలో 33 మెడికల్ కళాశాలలు పెట్టుకోవడమే కాకుండా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లలో 500 పడకల దవాఖానలను ఏర్పాటుచేయబోతున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దేశంలోనే రాష్ట్రం క్రీడల్లో ముందుండేలా కృషిచేయాలని కోరారు. త్వరలోనే కరీంనగర్లో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.
కాగా, అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి ఫొటోగ్యాలరీని పరిశీలించి క్రీడలను ప్రారంభించారు. ఇక్కడ సిరిసిల్ల, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్లు రామతీర్థపు మాధవి, జిందం కళ, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హన్మంతరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణు కిషన్రావు, ప్రధాన కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చెన్నమనేని శ్రీకుమార్, అబ్జర్వర్ వెంకటేశ్వర్ రావు, తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఉన్నట్లుగానే ప్రైవేట్ రం గంలోనూ క్రీడాకారులకు కోటా కల్పించేందుకు కృషిచేస్తాం. అనేక పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల్లో వేలాది ఉద్యోగాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్తో మాట్లాడి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రిజర్వేషన్ ఏర్పాటుకు కృషిచేస్తాం. కార్పొరేట్ సంస్థలు కూడా క్రీడాకారులను ప్రో త్సహించేందుకు ముందుకు రావాలి. మన తర్వాత స్వాతంత్య్రం తెచ్చుకున్న చైనా ఒలింపిక్స్లో అనేక పతకాలు సాధిస్తోంది. మనదేశం మాత్రం పేదరికం, ఆర్థిక స్థితిగతుల వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. దేశానికి క్రీడాకారులు ఎంతో అవసరం. ప్రైవేటు రం గంలో రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. దీనిపై కార్పొరేట్ సంస్థలు దేశ వ్యాప్తంగా ఆలోచన చేయాలి.
– వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
దేశంలోనే మొదటిసారిగా 52ఏళ్ల కిందటే సిరిసిల్ల పా త తాలుకలో రూ.100కోట్లతో సహకార సంఘంగా వి ద్యుత్ సంస్థను రాజేశ్వర్రావు ఏర్పాటు చేశారు. ఆంధ్రా ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ బ్రహ్మనందరెడ్డితో మాట్లాడి సెస్ సహకార సంఘాన్ని ఏర్పాటుచేయడమే కాకుండా విద్యుత్ను కూడా తీసుకొచ్చా రు. విద్యుత్ సంస్థ సిరిసిల్లకు రావడంతో మరమగ్గాలు వచ్చి నేతన్నకు ఉపాధి పెరిగింది. 500 మంది పేదలకు రాయల చెరువులో ప్రభుత్వంతో కోట్లాడి పట్టాను ఇ ప్పించారు. శతజయంతి సందర్భంగా క్రీడలు నిర్వహించుకోవడం గర్వకారణంగా ఉంది. ఏడాది ఆగస్టు 31వరకు ఆయన పేరిట ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– రమేశ్బాబు, ఎమ్మెల్యే, వేములవాడ
ఈ ప్రాంతంలో క్రీడా పాఠశాలను ఏర్పాటు చేయాలి. త్రిపుర రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి క్రీడలకు వేములవాడలో జరిగే పోటీల నుంచే జట్టును ఎంపిక చేస్తాం. ఈ పోటీల్లో ఉమ్మడిజిల్లాల వారీగా 20జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజులపాటు పురుషులు, మహిళల విభాగంలో పోటీలు నిర్వహిస్తాం.
– రమేశ్, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు