రాజన్నసిరిసిల్ల (నమస్తేతెలంగాణ), జగిత్యాల టౌ న్/ ఓదెల సెప్టెంబర్ 29: ఉదయం ఎండ..ఉక్కపోత ఉండగా మధ్యాహ్నం ఉన్నట్టుండి మేఘావృతమై వర్షం దంచికొట్టింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మోస్తారుగా, జగిత్యాల జిల్లాలో భారీగా కురిసింది. అత్యధికంగా ధర్మపురి మండలం బుర్దేష్పల్లిలో 7.4 సెంటీమీటర్లుగా రికార్డయింది. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో 7.1 8 సెంమీ. జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 6.8 సెంమీ వాన పడ్డది.
సిరిసిల్ల జిల్లాలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 వరకు ఏకధాటిగా కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్ మండలంలో 16.3 మీ.మి నమోదైంది. ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో నిమజ్జనానికి అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పొట్ట దశలో ఉన్న వరి నేలవాలింది.
వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొలనూర్లోని అప్పమయ్య చెరువు మత్తడి దుంకింది. కరీంనగర్ జిల్లాకేంద్రం, అల్గునూర్, కరీంనగర్ రూరల్ మండలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో పలుకాలనీల్లోకి వరదనీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది.