పెద్దపల్లి, జనవరి28: జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మ్యూజియం, గ్రంథాలయాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
మ్యూజియంలోని రామగిరి ఖిల్లా, గౌరిగుండాల (సబ్బితం) జలపాతం, పాత రాతి యుగపు పనిముట్లు, నాణేలు, మందల ఏళ్లనాటి వృక్ష శిలాజాలు తదితర అంశాలపై ఆర్కిలయాజిస్టు శివనాగిరెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకరంగ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కాగా, మ్యూజియం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రామగుండం సీపీ రేమారాజేశ్వరి, అదనపు కలెక్టర్లు జే అరుణ శ్రీ, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, సీనియర్ ఫొటో గ్రాఫర్ రవీందర్ పాల్గొన్నారు.