Ramagundam | కోల్ సిటీ, జూలై 16 : గోదావరిఖని గంగానగర్ శివారులో గల స్మశాన వాటిక ఆత్మఘోష ను పట్టించుకోని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.1కే అంత్యక్రియలను ఎత్తివేయడం దారుణమని, చిమ్మచీకట్లో కాటికాడ కష్టాలు అంటూ పాలకులపై భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గోదావరిఖని శివారులోని నగర పాలక సంస్థ హిందూ స్మశాన వాటికను గురువారం సందర్శించారు. అక్కడి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోసిక మోహన్, నగర కార్యదర్శి కే కనకరాజ్, సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోకపోగా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపాయికే అంత్యక్రియలను ఎత్తివేయడం దారుణమన్నారు. స్మశాన వాటికలో సమస్యలను చూస్తే శవాలె కన్నీళ్లు పెట్టే విధంగా ఉన్నాయన్నారు.
పాలకులు అభివృద్ధి పేరిట రోడ్డును తవ్వి ఇప్పటివరకు రోడ్డు వేయలేదని ఆరోపించారు. గంగానగర్ ఫ్లై ఓవర్ నుంచి స్మశాన వాటిక వరకు విద్యుత్ దీపాలు లేక వచ్చిపోయే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గతంలో రెండు, మూడు పంపులు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆ పంపులన్నీ మరుగుపడ్డాయన్నారు. చెట్ల పొదలు చెత్తా చెదారం, పాములు, తేళ్లతో స్మశాన వాటిక అద్వాన్నంగా తయారైందన్నారు. మృతదేహాలను క్రిమేషన్ చేయడానికి రూ.30లక్షలతో ఏర్పాటు చేసినా ఎలక్ట్రిక్ మిషన్ పూర్తిగా తప్పుపట్టిపోయిందన్నారు. మంచిర్యాల తరహాలో మహా ప్రస్థానం పేరిట స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రూపాయికే అంత్యక్రియల పథకాన్ని పునరుద్ధరించాలని, లేనిపక్షంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాటేటి శంకర్, శనిగరపు చంద్రశేఖర్, తొడుపునూరి రమేష్, అబ్ధుల్ కరీం, కల్వల జగన్, పోతరాజు గంగారాజు, సాదుల శివ తదితరులు పాల్గొన్నారు.