Ramagundam | కోల్ సిటీ, జూన్ 23 : అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలనీ, పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ పనుల నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పని పూర్తయిన తర్వాత సైట్ క్లియర్ చేసి రాకపోకలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అన్నారు. తగిన కారణం లేకుండా పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలక సంస్థ ఏఈ తేజస్విని, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.