గొల్లపల్లి మండలంలో సాగునీటి సమస్య మొదలైంది. చిల్వకోడూర్, దట్నూర్, అబ్బాపూర్లో నీరందక పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతున్నది. కేసీఆర్ పాలనలో పదేళ్లపాటు ఏ బాధా లేకుండా సాగు చేసుకున్న రైతాంగం, ఇప్పుడు ఎండుతున్న పంటలను చూసి కన్నీరు పెడుతున్నది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నది.
గొల్లపల్లి, మార్చి 17 : గొల్లపల్లి మండలంలో సాగునీటి కటకట మొదలైంది. ముఖ్యంగా చిల్వకోడూర్ వాగును నమ్ముకొని పంటలు సాగు చేసిన చిల్వకోడూర్, దట్నూర్, అబ్బాపూర్లోని సుమారు 150 మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ మూడు గ్రామాల వాగొడ్డు రైతులు ఏటా 400 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి వారబంధీ పద్ధతిన విడుదలయ్యే నీరు రంగధామునిపల్లి రిజర్వాయర్లోకి చేరి మత్తడి దూకితే చిల్వకోడూర్ వాగు ప్రవహిస్తుంది. ఆ జలాలే వీరికి ఆధారం. వాగు నీటి ప్రవాహానికి కరెంట్ మోటర్లు పెట్టుకుని సాగు చేస్తుంటారు. ఇలా పదేండ్లుగా ఏ బాధా లేకుండా పంటలు పండించుకున్నారు.
ఈ యాసంగిలోనూ అలానే నీళ్లు వస్తాయని భావించి పంటలు వేసుకున్నారు. కానీ, ఎస్సారెస్పీ నుం చి వారబంధీ పద్ధతిన నీరు సక్రమంగా రాకపోవడంతో రంగధామునిపల్లి రిజర్వాయర్ నిండలేదు. అలుగుపారలేదు. దీంతో వాగులో చుక్కనీరు లేక రైతులు అరిగోసపడుతున్నారు. పంటలు చేతికందే దశలో ఉన్నాయని, మరో నాలుగు తడులు అందితేనే దక్కుతాయని, లేదంటే ఎండిపోవడం ఖాయమని వాపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు పొలాలు నెర్రెలు బారాయని, మరో పదిరోజులు నీరందకుంటే పశువుల మేతకు వదిలేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రంగధామునిపల్లి రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి, నీరందించాలని వేడుకుంటున్నారు.
ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ-83 నుంచి వచ్చే నీటితోనే రంగధామునిపల్లి రిజర్వాయర్ నిండుతుంది. 12 ఫీట్ల ఎత్తుకు నీటినిల్వ చేరితే అలుగుపారి చిల్వకోడూర్ వాగు ప్రవహిస్తుంది. ప్రస్తుతం 4 ఫీట్ల మేర మాత్రమే నీరు ఉన్నది. దీంతో అలుగు పారే పరిస్థితి లేదు. గత వారం విడుదలైన నీటిని ఇతర ప్రాంతానికి తరలించడంతో రిజర్వాయర్ నిండలేదు. వారబంధీ కింద మరో రెండు తడులు వచ్చే అవకాశమున్నది. అయితే, ఆ తడులు ఎప్పుడు వస్తాయో..? అప్పటి వరకు పంటలు ఉంటాయో.. పోతాయో..? తెలియక రైతుల్లో ఆందళోన కనిపిస్తున్నది.