కరీంనగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వడంలో మిల్లర్ల మాయాజాలం బయటపడుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన వడ్లకే ఎసరు పెట్టి కొందరు కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి వస్తున్నది. ఇప్పటికే పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైన కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లర్ను రిమాండ్కు తరలించడం సంచలనం రేపుతున్నది. మరోవైపు ఈ నెలాఖరులోగా లక్ష్యం మేరకు సీఎంఆర్ ఇవ్వడం అనుమానమేనని తెలుస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు రోజులపాటు తనిఖీలు చేయగా, అడ్డదారులు తొక్కిన మిల్లర్లలో వణుకుపుడుతున్నది.
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ చుట్టు పక్కల రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వానకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొంటున్న ప్రభుత్వం, పైసా ఖర్చు లేకుండా మిల్లులకు కస్టం మిల్లెడ్ రైస్ (సీఎంఆర్) పేరిట సరఫరా చేస్తున్నది. ఇదే అదునుగా కొందరు మిల్లర్లు అడ్డదారులు తొక్కారు. బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా నేరుగా ధాన్యాన్నే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి దిగజారారు. ఇటీవల జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతంలోని ఏడు మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, అక్కడ జరుగుతున్న తతంగం చూసి ఏకంగా విస్తుపోయారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఒక మిల్లర్ అక్రమాలను చూసిన ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మిల్లులోనే దాదాపు 4 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించినట్టు తెలిసింది.
రెండు మూడు రోజుల కింద శంకరపట్నం మండలం మొలంగూర్లోని ఒక మిల్లులో కూడా ఇలాంటి బాగోతమే బయటపడింది. దాంతో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రజనీకాంత్ బాధ్యుడిపై కేసు పెట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాలుగైదు రోజులుగా వరుస తనిఖీలు చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా కరీంనగర్లోని రెండు, మానకొండూర్ మండల కేంద్రంలోని రెండు, తిమ్మాపూర్ మండలం రేణికుంటలోని మరో రెండు రైస్ మిల్లుల్లో సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ మిల్లుల్లోనూ ప్రభుత్వం కేటాయించిన ధాన్యం పూర్తి స్థాయిలో లేదని దృష్టికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, మొలంగూర్కు చెందిన ఒక మిల్లర్పై కేసు నమోదు చేసిన అధికారులు మిగతా మిల్లర్లపైనా ఎందుకు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు విక్రయం?
ప్రభుత్వం మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యం ఏమైందనే చర్చ జోరుగా సాగుతున్నది. కొందరు మిల్లర్లు నిజాయితీగా సీఎంఆర్ ఇస్తున్నా.. మరికొందరు మాత్రం అక్రమాలకు పాల్పడుతుండడం మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నది. నిజానికి గతంలో మిల్లర్లు బియ్యం మరాడించిన తర్వాత సీఎంఆర్ ఇవ్వకుండా అమ్ముకోవడమో, పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఇవ్వడమో చేసేవారు. కానీ, ఈ సారి మాత్రం ఏ-కంగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్నే అమ్ముకునే స్థితికి చేరారు. బియ్యం కంటే ధాన్యం అమ్మితేనే ఎక్కువ అక్రమార్జన వస్తుందని భావించి ఈ విధంగా ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు అక్రమంగా ధాన్యాన్ని తరలించి విక్రయించినట్లు తెలుస్తున్నది. ఇంత దారుణంగా అమ్ముకోవడం చర్చనీయాంశంగా మారింది.
గడువులోగా అనుమానమే
2022-23 వానకాలం సీజన్కు సంబంధించి జిల్లా, ఇతర జిల్లాల రైతుల నుంచి సేకరించిన 2,96,900.440 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుల కెపాసిటీని బట్టి కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని మిల్లులకు కేటాయించారు. గడువులోగా సీఎంఆర్ ఇవ్వాల్సి ఉన్నా.. మిల్లర్ల సాకులు నమ్మి అధికారులు గడువు పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 1,99,901.890 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా 34,863.690 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. గత డిసెంబర్ 31 వరకే ఉన్న గడువును ఈ నెలాఖరు వరకు పెంచారు. ఇక 2022-23 యాసంగి సీజన్లో చూస్తే జిల్లా, ఇతర జిల్లాల నుంచి 3,74,825.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అందించారు. 2,53,634.580 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 60,088 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇంకా 1,93,544 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. దీనికి కూడా ఈ నెల 31 వరకే గడువు ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఏ విధంగా ఇస్తారనేది అనుమానంగానే ఉన్నది.