పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు రచ్చకెక్కుతున్నది. అసలే అంతంతే ఉన్న పరువు కాస్తా బజారున పడుతున్నది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర మంగళవారం రసాభాసగా మారింది. ఆధిపత్య పోరుతో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ఓదెల జడ్పీటీసీ గంట రాములు వర్గాలుగా నాయకులు చీలిపోయి, భట్టి కండ్ల ముందే కర్రలతో దాడి చేసుకోవడం, రాములు వర్గీయుడి తలకు గాయమై పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు ధర్మారం మండలంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఉన్న నాయకులు మూడు గ్రూపులుగా మారి బలప్రదర్శనకు దిగడం నేతల మధ్య విబేధాలను బయటపెట్టింది.
పెద్దపల్లి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి రూరల్/ధర్మారం : కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ‘హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో రసాభాసగా మారింది. పెద్దపల్లి మండలంలో నాయకుల మధ్య విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మల్లు పాదయాత్ర పాలితం మీదుగా పెద్దపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించగానే స్వాగతం పలికేందుకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ వేర్వేరుగా తమ అనుచరులతో సిద్ధమయ్యారు. ఇద్దరు ఒకే చోట ఉండాల్సి రావడంతో.. ఎవరికి వారే తమ నాయకులకు జై కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భట్టి కండ్ల ముందే ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు. ఘర్షణ పడుతున్న వారిని మల్లు భట్టి వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి చేయి దాటి పోతుందేమోనని ఆగ్రహించిన మల్లు భట్టి, అంగరక్షకుడు ‘ఏం తమాషాగా ఉందా..?’ అంటూ చేతిలో ఉన్న తుపాకీని చూపుతూ పక్కకు తప్పించడంతో ఇరువర్గాలు పాదయాత్రగా ముందుకు సాగారు. తర్వాత సాయంత్రం పెద్దపల్లి జిల్లాలోని బొంపల్లి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి ఒకవైపు విజయరమణారావు, మరోవైపు గంట రాములుకు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయ రమణారావు వర్సెస్ రాములుగా మారిపోయింది. ఇరు వర్గాలు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఓదెల జడ్పీటీసీ గంట రాములు వర్గీయుడు ఓదెల మండలానికి చెందిన నర్సింగ్పై మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు వర్గీయులు దాడి చేసి తల పగులగొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇటు మాజీ ఎమ్మెల్యే, అటు గంట రాములు వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేశారు. అనంతరం గంటరాములు వర్గీయులు నిరసనకు దిగారు. విజయ రమణారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా మండలంలోని కనగర్తి శివారులోని కాపులపల్లి క్రాస్ రోడ్డు వద్ద నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో భోజన వసతిని ఏర్పాటు చేయగా, ఓదెల జడ్పీటీసీ గంట రాములు తన అనుచరగణంతో అక్కడి నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయడు గోనే ప్రకాశ్రావు గమనించారు. వెంటనే గంటరాములుతో మాట్లాడి భోజనశాలకు తీసుకునివెళ్లారు. భట్టి పాదయాత్ర సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్లో నాయకుల మధ్య విబేధాలు పొడచూపడం, మరోవైపు బీసీలు, అగ్రవర్ణాలు వర్గాలుగా ఏర్పడి బాహాబాహీకి దిగడం పెద్దపల్లిలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో పెద్దపల్లి జిల్లాలో భట్టి పర్యటన కాంగ్రెస్లోని విభేదాలను బట్టబయలు చేసింది.
ధర్మారం మండలంలోనూ భట్టి జోడో యాత్రలో విబేధాలు భగ్గుమన్నాయి. మంగళవారం ఉదయం రచ్చపల్లి గ్రామం నుంచి పెద్దపల్లి మండలం దాకా వెళ్లే మార్గం మధ్యలో వస్తున్న భట్టికి స్వాగతం పలికేందుకు ధర్మపురి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నాయకులు మద్దెల రవీందర్, గజ్జెల స్వామి తమ అనుయాయులతో వేర్వేరుగా గ్రూపులుగా ఏర్పడ్డారు. లక్ష్మణ్ గ్రూపు గ్రామంలోని రోడ్డుపై వేచి ఉండగా, జడ్పీ పాఠశాల ఎదుట మద్దెల రవీందర్ వర్గం ఒగ్గుడోలు కళాకారులతో సిద్ధమైంది. మరో ప్రాంతంలో రోడ్డుపై ప్లెక్సీలతో తయారు చేసిన ప్లకార్డులు పట్టుకుని గజ్జెల స్వామి వేచిఉండడంతో ఆ పార్టీ నేతల మధ్య విబేధాలు ఉన్నట్లు తేలిపోయింది. అయితే పాత మేడారం నుంచి ఒకసారి, తర్వాత ధర్మపురి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ టికెట్ పొంది ఓడిపోయిన లక్ష్మణ్కుమార్, మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ ఆశిస్తున్నారనే సమాచారంతో తమకు కూడా టికెట్ కావాలని మద్దెల రవీందర్, గజ్జెల స్వామి పట్టుపడుతున్నారు. ఈ సారి లక్ష్మణ్కు టికెట్ రాకుండా చేసి తమలో ఎవరికైనా ఇవ్వాలని అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాగా, లక్ష్మణ్కుమార్పై సొంత పార్టీల నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండడం మండలంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.