స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులను భాగస్వాములను చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే పలుసార్లు జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్నది. ఇదే స్ఫూర్తితో ‘పల్లె మెరిసేలా.. పట్నం మురిసేలా’ తీర్చిదిద్దుతూ జిల్లాను దేశానికే ఆదర్శంగా నిలిపే దిశగా వేగంగా దూసుకెళ్తున్నది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో ఏ వీధికెళ్లినా చెత్తాచెదారం పేరుకుపోయేది. పిచ్చిమొక్కలు, కంపుకొట్టే మురుగు కాలువలు దర్శనమిచ్చేది. ఇక వానకాలం వచ్చిదంటే ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేది. ఇంటిల్లిపాది రోగాల బారినపడేది. విషజ్వరాలు, డయేరియా, మలేరియా, కలరా లాంటి అంటువ్యాధులతో అల్లాడేది. కనీస వైద్యమందక ఎందరో ప్రాణాలు విడిచేది. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేలవేలకు ధారపోసేది. కష్టార్జితమంతా వైద్యశాలల పాలయ్యేది. వెరసి అప్పుల కుప్ప పెరిగిపోయి పేదలు విలవిల్లాడేది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. పల్లె, పట్టణ ప్రగతి పథకాలకు అంకురార్పణ చేశారు. దీనికింద నెలనెలా ఠంఛన్ నిధులు మంజూరు చేస్తున్నారు. సర్కారు ఆదేశాల మేరకు అధికారులు రోడ్లు, డ్రైనేజీల పరిశుభ్రతపై దృష్టి సారించారు. శుభ్రతపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ సర్వేక్షణ్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రగామిగా నిలిపి అవార్డులు అందుకున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి స్ఫూర్తితో మరో ఉద్యమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈనెల 21నుంచి అక్టోబర్ 2వరకు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విజయవంతం చేసేందుకు యంత్రాంగం ప్రజలు, విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. ప్రతి శుక్రవారం డ్రైడే, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడం, స్వచ్ఛమైన నీరు తాగడం, మురుగు కాలువల్లో పూడికను తొలగించడం, తడి, పొడిచెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి ఇవ్వడం లాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు.
పాఠశాల నుంచి కళాశాల వరకు చదువుతున్న విద్యార్థులలో పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీల్లోని అన్ని స్కూళ్లల్లో విద్యార్థులకు స్వచ్ఛతపై వ్యాసరచన, చిత్రలేఖన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తమ విద్యార్థులకు బహుమతులను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పారిశుధ్య సిబ్బంది ప్రతి రోజూ ఇంటి ముందుకే వచ్చి సేకరిస్తున్నారు. దీంతో రోడ్లకు ఇరువైపుల, ఖాళీ స్థలాల్లో చెత్త కనిపించడం లేదు. డ్రైనేజీల వెంట పెరిగే పిచ్చిమొక్కలను వెంట వెంటనే తొలగిస్తున్నారు. వీధులను శుభ్రం చేస్తున్నారు. వారంలో ఒక రోజు ప్రతి పల్లెలో సామూహిక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి మహిళలు, పురుషులను భాగస్వాములను చేస్తున్నారు. తాగునీటి నల్లాల వద్ద శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉండడంతో నీళ్లను కాచి వడపోసుకుని తాగాలని సూచిస్తున్నారు. ఓవైపు పంచాయతీ, మున్సిపల్ అధికారులు పారిశుధ్యంపై చర్యలు తీసుకుంటుండగా, ప్రజలు వ్యాధులు బారిన పడకుండా వైద్య, ఆరోగ్య శాఖ జాగ్రత్తలు చేపట్టింది. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వరాలు, వివిధ వ్యాధులపై వివరాలు సేకరిస్తున్నారు. జ్వర పీడుతులను వెంటనే అంబులెన్స్లో దవాఖానలకు చేరుస్తున్నారు. ఇలా స్వచ్ఛతాహీ సేవా పేరిట పల్లె, పట్టణం మెరిసేలా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలతో సైతం పరిసరాలను స్వచ్ఛతగా ఉండేలా తీర్చి దిద్దుకుంటామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.
ప్రభుత్వం చేపట్టిన పల్లె, ప్రగతి ద్వారా అద్భుత ఫలితాలు సాధించినం. పారిశుధ్యంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది. గ్రామాలన్నీ స్వచ్ఛత వైపు అడుగులేస్తున్నాయి. ప్రతి గ్రామంలో 20 మందితో కమిటీ వేశాం. సమస్యలను గుర్తించి పరిష్కరించినం. జాతీయస్థాయిలో జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఈ స్ఫూర్తితో స్వచ్ఛతాహీ సేవలో ముందుంటామని భావిస్తున్నాం. మంత్రి కేటీఆర్ మార్గదర్శకం, కలెక్టర్ ఆధ్వర్యంలో, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులు, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఇందులోనూ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాం.
దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో జిల్లా తొలిస్థానం దక్కించుకున్నది. జాతీయస్థాయిలో సిరిసిల్ల రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మున్సిపాల్టీతో పాటు, జిల్లా పరిషత్ పలుమార్లు అవార్డులను గెలుచుకున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలోని మోహినికుంట, మండెపల్లి ఆదర్శ గ్రామాలుగా పురస్కారాలు పొందాయి. ప్రస్తుతం స్వచ్ఛతా హీసేవ కార్యక్రమంలోనూ జిల్లాను ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్న యంత్రాంగానికి ప్రజలంతా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో ముందుకు పోతున్నారు.