Peddapalli | పల్లెటూరి అమ్మాయిలు రాష్ట్రపతి భవన్ మెట్లెక్కబోతున్నారు. తొమ్మిదో జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటిన వారు రాష్ట్రపతి ఎదుట తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించబోతున్నారు. పోటీల్లో భాగంగా తెలంగాణ నుంచి ఎనిమిది ప్రాజెక్టులు ఎంపికకాగా, ఇందులో ఓదెల మండల కొలనూర్కు చెందిన పూజశ్రీ రూపొందించిన యాక్సెల్ కెమెరా, రామగిరి మండలం చందనాపూర్కు చెందిన దాసరి తయారు చేసిన కామన్మాన్ ఫ్రెండ్లీ మల్టీపుల్ హెల్మెట్ విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి 13 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ‘ఫైన్’లో విజేతలందరూ పాల్గొనాలనే పిలుపులో భాగంగా వీరిద్దరికీ ఆహ్వానం మేరకు శుక్రవారం తరలివెళ్లగా, గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి కమాన్/ఓదెల, ఏప్రిల్ 7: తొమ్మిదో జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లా పేరును ఇనుమడింపజేసిన ఇద్దరు విద్యార్థులకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగే ఫైన్ వేడుకలకు ఆహ్వానం అందింది. రామగిరి మండలం చందనాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన దాసరి హర్షిత, సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన ముస్త్యాల పూజశ్రీ (9వ తరగతి) ఇద్దరికి ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎన్ఐఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్’ (ఫైన్-2023)లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులు హర్షిత, పూజశ్రీ, జిల్లా సైన్స్ అధికారి రవినందన్రావుతో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పోటీల్లో దేశంలో 60 ప్రాజెక్ట్లు ఎంపిక కాగా, అందులో తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపికయ్యాయి. ఇందులో పూజశ్రీ, హర్షిత ప్రాజెక్టులు ఎంపిక కాగా, గత సెప్టెంబర్ నెలలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన జాతీయ ఇన్స్పైర్లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ చేతుల మీ దుగా అవార్డును కూడా అందుకున్నారు. కాగా, ఢిల్లీలో నాలుగు రోజుల పాటు జరిగే ఫైన్ కార్యక్రమంలో దేశం నలుమూల నుంచి జాతీయ స్థా యిలో విజేతలైన 60 మంది విద్యార్థులతో పాటు యువ ఆవిష్కర్తలు తమ ఎగ్జిబిట్ల(ఆవిష్కరణలు) ను ప్రదర్శించనున్నారు. ఢిల్లీకి తరలివెళ్లిన పూజశ్రీని సర్పంచ్ సామ మణెమ్మ, ఉపసర్పంచ్ పా కాల సంపత్రెడ్డి, గ్రామస్తులు అభినందించారు.
విద్యార్థుల ప్రదర్శనలు
చందనాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని డీ హర్షిత కామన్మాన్ ఫ్రెండ్లీ మల్టిపుల్ హెల్మెట్ను గైడ్ టీచర్ టీ సంపత్కుమార్ సహకారంతో రూపొందించింది. దీని తయారీ కోసం హెల్మెట్, రెండు ఫ్యాన్లు, పొగను గుర్తించే సెన్సార్, బ్యాటరీని వాడింది. బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రాజెక్టు కావడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం. పూజితశ్రీ స్కూల్ బస్కు యాక్సెల్ కెమెరాను రూపొందించింది. అతి తక్కువ ఖర్చు తో ఒక చిన్న బస్సు బొమ్మకు ఈ కెమెరాను బిగించింది. వాహనాల కింద ఏ జీవి ఉన్నా బస్సు కదిలేటప్పుడు డ్రైవర్ ముందు డిస్ప్లేలో కనిపించేలా ప్రదర్శన ఇచ్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
మా మామయ్య కోసం..
మాది మంథని మండలం దుబ్బపల్లి. మా తల్లిదండ్రులు దాసరి స్వ ప్న-శ్రీనివాస్ వ్యవసాయ కూలీగా పని చేస్తారు. మా మామయ్య గోదావరిఖనిలో వెల్డింగ్ పనులు చేస్తుండేవాడు. కొద్దిరోజులకు వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే కెమికల్ పొగ వల్ల మామయ్య ఊపిరితిత్తులు దెబ్బతిని అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మామయ్య ఆరోగ్యం చెడిపోకుండా పని చేసుకునేలా ఏదైనా చేయాలనుకున్నా. మా గైడ్ టీచర్ సంపత్కుమార్ సార్కు సమస్య చెప్పాను. దీనిపై ఆలోచించి గైడ్ టీచర్ సహకారంతో పది రోజుల్లో కామన్మాన్ ఫ్రెండ్లీ మల్టిపుల్ హెల్మెట్ను తయారు చేసి మామయ్యకు ఇచ్చాను. ఇది వెల్డింగ్ పనులకే కాకుండా, కార్పెంటర్స్, ట్రాఫిక్ పోలీసులకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మరిన్ని పరికరాలు తయారు చేస్తాననే నమ్మకం నాలో కలిగింది.
– దాసరి హర్షిత, 7వ తరగతి, జడ్పీ స్కూల్ (చందనాపూర్)
ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో..
మాది ఓదెల మండలం కొలనూర్. తల్లిదండ్రులు ముస్త్యాల అనిత-శ్రీనివాస్ గ్రామంలో కిరా ణా షాపు నడుపుతుంటారు. నేను సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో చదువుతున్నా. ఓ రోజు స్కూల్కు బస్సులో వెళ్తుండగా బస్సు టైర్ల కింద కుక్క పిల్ల పడి చనిపోయింది. చాలా బాధ అనిపించింది. కుక్క పిల్లలే కాదు పలుచోట్ల చిన్నపిల్లలు కూడా బస్సు ఆగినపుడు కిందికి వెళ్లి మృతిచెందిన వార్తలు విన్నా. వా హనాల టైర్ల కింద పడి ఏ జీవి కూడా మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించిన. మా స్కూల్ ప్రిన్సిపాల్ శ్యామ్సుందర్రెడ్డి, టీచర్ల సూచనలు, సలహాలతో యాక్సెల్ కెమెరా తయారు చేసిన. దీని ద్వారా వాహనాల కింద ఏ జీవి ఉన్నా బస్సు కదిలేటప్పుడు డ్రైవర్ ముందు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఏ వాహనానికైన ఈ కెమెరా అమర్చుకోవచ్చు మా అమ్మ-నాన్న, ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో నేను జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది.
– ముస్త్యాల పూజశ్రీ, 8వ తరగతి (లల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్, సుల్తానాబాద్)