Timpapur | తిమ్మాపూర్, జూలై 2 : తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను గురువారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత సంఘాల ఆధ్వర్యంలో అనూహ్యంగా ఆవిష్కరించారు. గత కొన్ని రోజులుగా రాజకీయ రగడ చోటు చేసుకోగా అన్నింటికీ తెర దించుతూ ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విగ్రహాల కోసం పర్మిషన్ వచిందంటూ ప్రకటించారు.
ప్రకటించి ఇన్నాళ్లయినప్పటికీ పనులు చేయడం లేదని ఆరోపిస్తూ దళితులతో కలసి ఆవిష్కరించి, పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. తామే పనులు చేయిస్తామని పనులు చేపట్టారు. గతంలో మండల దళిత సంఘాల నాయకులు కోరడంతో.. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలని ఉద్దేశంతో తామే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశామని, అప్పటి ఎండీ నాగిరెడ్డి పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల విగ్రహాల ఆవిష్కరణ ఆలస్యమైందని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ ఈ విగ్రహాలపై అలసత్వం ప్రదర్శించారన్నారు. ఇటీవల కాలంలో పర్మిషన్ వచ్చిందని, కోటి నిధులతో సుందరికరణ చేయిస్తానని ప్రకటించిన ఆయన ఇప్పటికీ పనిచేయడం లేదని అందుకే తామే ఆవిష్కరించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన కూడా కోటితో సుందరీకరణ పూర్తి చేస్తే అందరం కలిసి అంబేద్కర్ జాతర చేసి పండుగ చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడే దళిత సంఘాల నాయకులు దళితులతో కలిసి భోజనాలు చేశారు.