అన్ని రంగాల్లో ముందుకు
దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద పోలీసు భవనాలు నిర్మించలేదు. ఈ సందర్భంగా స్థానిక వాసిగా సీఎం కేసీఆర్కు నా కృతజ్ఞతలు. ఇప్పటికీ సింగరేణి, ఎన్టీపీసీ సహకారంతో 3.60 కోట్లతో గోదావరిఖని మోడల్ వన్టౌన్ పోలీస్స్టేషన్, 3.80 కోట్లతో పోలీసు అతిథి గృహం భవనాలను సీఎం కేసీఆర్ సహకారంతో నిర్మించాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతున్నది.
– రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్
కేసీఆర్, కేటీఆర్తోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతోనే రామగుండం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ను అడిగిన వెంటనే మెడికల్ కాలేజీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టును మంజూరు చేశారు. యువతకు ఉపాధి కల్పనకు ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్ రూ.వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా.
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని/ ఫర్టిలైజర్సిటీ, మే 8: ప్రజాభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ పాలన ఆదర్శవంతంగా సాగుతున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గోదావరిఖనిలో నూతనంగా నిర్మించిన రామగుండం పోలీసు కమిషనరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సోమవారం హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీతో కలిసి హాజరైన మంత్రి అనంతరం కమిషనరేట్లో సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజాభివృద్ధే ధ్యేయం గా తెలంగాణ ఆదర్శవంతమైన పాలనను ఆచరిస్తున్నదని, దేశం అనుసరించేలా మన పాలసీలు అమలవుతున్నాయ ని మంత్రి పేర్కొన్నారు. మన పోలీస్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు.
దేశ సరిహద్దులను కాపాడేది సైనికుడైతే అంతర్గత భద్రతను రక్షించేది పోలీసేనన్నారు. రాష్ట్రంలో పోలీసులు చిత్తశుద్ధితో శాంతిభద్రతలను నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు ఆవేదనతో పనిచేశారని, ఉద్య మం కోసం పోలీస్ కానిస్టేబుల్ కృష్టయ్య తన ప్రాణాలను బలిదానం చేసుకున్న ఘటనను గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకున్నామని, ఉద్యోగం అం దించడంతోపాటు కృష్ణయ్య కుమార్తె ప్రియాంకను డాక్టర్ చదివించగా ప్రస్తుతం ఆమె కరీంనగర్ బస్తీ దవాఖానలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన భద్రత వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పుతున్నామన్నారు. పోలీసులకు ఆధునిక భవనాలు, వాహనాలు, సాంకేతికతను వినియోగించే విధంగా పరికరాలను అం దించామన్నారు. రాష్ట్ర రాజధానికి 230 కిలోమీటర్ల దూరంలో ఆధునిక హంగులతో కూడిన భవనాలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు.
ఎక్కడా లేని విధంగా రోడ్డుపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు 30శాతం రిస్క్ అలవెన్స్లు ప్రథమంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. రాష్ట్ర ఏర్పా టు నుంచి క్షేత్ర స్థాయిలో పోలీస్స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా ప్రత్యేక బడ్జెట్ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడే అంశంలో మనుషులు శాశ్వతం కాదని, వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయన్నా రు. ప్రజలకు మేలు చేసే పాలసీలను తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అవలంబిస్తున్నదని, ఈ రామగుండం పోలీసు కమిషనరేట్ భవనం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. రామగుండం పర్యటనతో తనకు గోదావరి బ్రిడ్జిపై మే నెల లో మండుటెండలో కాళేశ్వరం ఫలితంగా గోదావరి జల దృశ్యం ఆవిష్కృతమవుతుందని, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ నాయకత్వం, అధికారుల శ్రమ ఫలితమే గోదావరి నిండుగా జలకళ సాధ్యమైందన్నారు. ఇక్కడ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, మండలి చీఫ్ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, రమణ, ఎంపీ వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ సంగీతా సత్యనారాయణ ఉన్నారు.
అట్టహాసంగా ప్రారంభోత్సవం
మంత్రి కేటీఆర్ సోమవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. మధ్యాహ్నం 3.40 గంటలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న ఆయన, దాదాపు గంటకుపైగా అక్కడే ఉన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, నడిపెల్లి దివాకర్రావుతో కలిసి కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సీపీ కార్యాలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, సీపీ రెమో రాజేశ్వరి నూతన చాంబర్లోని కుర్చీలో ఆశీసునులయ్యారు. ఈ సందర్భంగా రిజిస్టర్ మంత్రి కేటీఆర్, హోంశాఖ మంత్రి, డీజీపీ, సంతకాలు చేశారు. ఆ తర్వాత సీపీ అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం డీజీపీ అంజనీకుమార్ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తన ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో కలిసి డీజీపీని సన్మానించారు.
శాంతిభద్రతలకు పెద్దపీట
తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ శాంతిభద్రతల నిర్వహణకు పెద్దపీట వేశారు. గత పాలనలో కేవలం రెండు కమిషనరేట్లు ఉండగా, ప్రస్తుతం అదనంగా ఏడు పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సకల వసతులతో పోలీసు భవనాలను ఏర్పాటయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ను నిర్మించుకున్నాం.
-హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
దేశానికే రోల్మెడల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎక్కడ శాంతిభధ్రతలు బాగుంటాయో అక్కడికి పెట్టుబడులు ఎక్కువగా వస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది. తెలంగాణ పోలీసింగ్ వ్యస్థ దేశానికి రోల్మోడల్.
అంజనీకుమార్, డీజీపీ
శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం
2014 తర్వాత తెలంగాణ ఏర్పాటుతో పోలీస్ శాఖకు అవసరమైన నిధులను కేటాయించడంతో శాంతిభద్రతలకు తగిన ప్రాధాన్యత లభించింది. నేను కేరళ రాష్ర్టానికి చెందిన అధికారిని అయినా ఇక్కడి ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. భారీ నిధులతో ఈ కమిషనరేట్ నిర్మాణం జరిగింది. ఇలాంటి నిర్మాణం ఎక్కడా జరుగలేదు.
– రెమా రాజేశ్వరి , సీపీ