సిరిసిల్ల/గంభీరావుపేట, సెప్టెంబర్ 27 : రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటికి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. గంభీరావుపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం, అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. మండలంలో ఒకే రోజు 369 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఒకటి కంటే ఎక్కువ అందుతున్నాయని వివరించారు. సమైక్య రాష్ట్రంలో నీటి వనరులు ఎండిపోయి ఎడారులను తలపించేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతోనే చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయని చెప్పారు. ఉమ్మడి పాలనలో ఎగువమానేరు విషయమై గంభీరావుపేట నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కానీ స్వరాష్ట్రంలో ఎగువ మానేరులోకి మల్లన్నసాగర్ నుంచి కూడవెళ్లి వాగు ద్వారా నీరు తరలించడంతో జలకళ వచ్చిందని, నట్టనడి ఎండకాలంలో సైతం ఎగువమానేరు పరవళ్లు తొక్కిందని గుర్తు చేశారు. కూడవెళ్లి వాగు ద్వారానే కాకుండా ప్యాకేజీ-9 ద్వారా మల్కపేట రిజర్వాయర్ నుంచి ఎల్లారెడ్డిపేటలోని సింగసముద్రం చెరువుకు నీటిని తరలించి, అక్కడి నుంచి గంభీరావుపేట మండలంలోని బట్టల చెరువు ద్వారా ఎగువ మానేరులోకి గోదావరి జలాలు తరలించుకునే అవకాశం ఉందన్నారు. నర్మాల ఎగువమానేరును 365 రోజులు నిండుకుండలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఈ ప్రాంత రైతుల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, గంభీరావుపేట చెరువులన్నీ నిండుకుండల్లా మారాయన్నారు.
కాంగ్రెస్ పాలకులు మానేరులోకి నీరు తీసుకురాకుండానే శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారని, వ్యవసాయానికి ఉచిత కరెంట్, పంట పెట్టుబడి, రైతు బీమా, సకాలంలో విత్తలు అందేలా చేస్తున్నారని ప్రశంసించారు. ఈ తొమ్మిదేళ్లలో రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా పనులు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. రైతులు ప్రమాదవశాత్తూ చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇచ్చే రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. 56 ఏండ్ల పాలనలో రూ.200 పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఆరు గ్యారంటీలంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. వారంటీలేని వాళ్లు ఓట్లు దండుకునేందుకు ఇచ్చే గ్యారంటీలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. గ్యారంటీ పథకాలు అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని, 65 ఏండ్లలో 11సార్లు గెలిపించి, కేంద్రం, రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టినా ఏం చేయలేదని, ఇప్పుడు అధికారం వస్తే ‘పప్పు బెల్లం పంచిపెట్టినట్లు’ అన్ని ఇస్తామంటే నమ్ముదామా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యారంటీగా కరంటు కష్టాలు, మంచినీటి కోసం యుద్ధాలు, రైతులకు ఎరువుల కొరత, ఏడాదికో సీఎం మారుతడని, విద్య, వైద్యం వంటివి వెనక్కి వెళ్లిపోతాయన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ రోటికాడి పాట ఆ రోటికాడనే పాడుతున్నారని అనగానే సభలో నవ్వులు విరిశాయి. ఇతర రాష్ర్టాలోల దోచిన పైసలను కాంగ్రెస్ నేతలు ఇక్కడ పంచుతారని, పైసలు తీసుకొని అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించుకుందామని కోరారు. కుల మతాలకతీతంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల విద్యను అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గంభీరావుపేటలో కేజీ టూ పీజీ విద్యాలయాల సముదాయాన్ని నెలకొల్పి ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. గంభీరావుపేటలో పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను పలకరించానని, వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే నియోజకవర్గం ఎమ్మెల్యేగా తన గుండె గర్వంతో ఉప్పొంగిందని చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తున్నదని మంత్రి చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారు నిరాశ చెందవద్దని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న గృహలక్ష్మీ పథకంలో అర్హులను గుర్తించే ప్రక్రియను జిల్లా అధికారులు చేపట్టారని, అందులో అవకాశం ఉంటుందని చెప్పారు. నియోజకవర్గంలో 648 గుడిసెలు, 432 రేకుల షెడ్లు, 907 ఇండ్లు శిథిలావస్థలో ఉన్నట్లు అధికారులు గుర్తించారని, ముందుగా గృహలక్ష్మి పథకంలో వీరందరికి తొలివిడతగా రూ.3లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇండ్లు ఉండేలా చొరవ చూపుతున్నామన్నారు. సభావేదికపై గంభీరావుపేటలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందించారు. సభా కార్యక్రమానికి ముందు మంత్రి కేటీఆర్ గంభీరావుపేట బీసీ కాలనీలో నిర్మించిన 169 డబుల్ బెడ్ రూం ఇండ్లను, ఎస్సీ కాలనీలో నిర్మించిన 104 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారితో సంతోషాన్ని పంచుకున్నారు.
గంభీరావుపేటను తిరిగి
గతంలో మున్సిపాల్టీగా ఉన్న గంభీరావుపేటను తిరిగి బల్దియాగా చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గంభీరావుపేట పాత గ్రామపంచాయతీ వద్ద రూ.3 కోట్లతో అధునాతన వ్యవసాయ మార్కెట్ను నిర్మిస్తామని, రూ.3కోట్లతో గంభీరావుపేట-లక్ష్మీ పూర్ రోడ్డుకు మహర్దశ తెస్తానని అమాత్యుడు వరాల జల్లు కురిపించారు.
ఎన్నికల వేళ మందు, పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకునే అలవాటు లేదని, బతికినన్నాళ్లు సిరిసిల్ల ప్రజలకు సేవ చేస్తానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీ మీద ఎంత నమ్మకం ఉంటే ‘మందు, పైసలు పంపిణీ చేయను’ అనే మాట అంటానో అర్థం చేసుకోవాలన్నారు. ‘మీకు సేవ చేసే నాయకుడిని, మీకు పనికివచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి. మీకు సేవ చేయగలిగే శక్తి నాకు ఉంది. నన్ను ఆశీర్వదిస్తే జీవితాంతం రుణపడి ఉంటా. మీరు ఉండమన్నాళ్లు ఇక్కడే ఉండి సేవలందిస్తానని’ మంత్రి స్పష్టం చేశారు.