మంథని, జనవరి 23: మాటలు చెప్పేదెవరో.. ప్రజల అక్కెర తీర్చేదెవరో ప్రజలు గుర్తించాలని రాష్ట్ర ఎస్సీ, మై నార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు మేలు చేసే లా జనరంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన గొప్ప విజ న్ ఉన్న నేత అని ప్రశంసించారు. మంథని పట్టణం పోచమ్మవాడలో నిర్మించిన ‘సావిత్రిభాయిపూలే కాలనీ’ 74 డబుల్ బెడ్రూం ఇండ్లను పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణితో కలిసి, సోమవారం ఆయన ప్రారంభించారు.
కాలనీలోని ఒక ఇంటికి రిబ్బన్ కట్ చేసి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ గృహ ప్రవేశం చేశారు. అంతకుముందు సోమవారం మంథని మం డలం దుబ్బపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని, రచ్చపల్లి పునరావాస కాలనీలో రూ. 31లక్షలతో నిర్మించిన పంచాయతీభవనం, రూ. 19.55 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, రూ. 71లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రూ. 1.30 కోట్లతో నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించారు.
ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ సమయం లో ప్రజల స్థితిగతులను గుర్తించిన సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల ఆవశ్యకతను గుర్తించి ప్రతీ పేద వాడికి కూడు, గూడు, గుడ్డ కల్పించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలకు రూప కల్పన చేశారన్నారు. మిషన్ భగీరథ తో ప్రతీ ఇంటికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరు ద్ధరించారని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు.
పేదొడి సొంతింటి కలను నిజం చేసేందుకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చారని, ప్రతీ పల్లె, పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను, ప్రతీ పేద వాడికి ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసేందుకు దవాఖానలను ఆధునీకరించడంతో పాటుగా ఎంసీహెచ్లు, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు, హరితహారం, పారిశుధ్యంలాంటి కా ర్యక్రమాలు చేపట్టారని వివరించారు. మున్ముందు మరి న్ని డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మాణాలను చేపట్టి ప్రతీ ఒక్కరూ గౌరవంగా జీవించేలా చూస్తామ న్నారు. నియోజకవర్గంలో మాటలు చెప్పేది ఎవరో.. అవసరాలు, అక్కెరలు తీర్చేదెవరో ప్రజ లు గుర్తించాలని, సరైన సమయంలో, సరైన విధంగా స్పందించాలన్నారు.
ఢిల్లీ గద్దెపై గులాబీ జెండా ఎగరేస్తాం:ఎంపీ వెంకటేశ్ నేతకాని
ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ గద్దెపై గులాబీ జెం డాను ఎగరడం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్కు మించిన దీక్షాదక్షత కలిగిన నాయకుడు లేడు. గత కాంగ్రెస్, టీడీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడి పోయింది. కుల, మతాలకతీతంగా పాలనను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. 14 ఏళ్ల నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమ, పోరాట ఫలితాలు నేడు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. రేపు దేశంలో, రా ష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.
ఒక్క అనర్హుడున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని పట్టణంలోని ఇల్లు లేని పేద కుటుంబాలను అర్హులుగా ఎంపిక చేసి జిల్లా మంత్రి, కలెక్టర్ అనుమతి తీసుకొని లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ నాయకులు అనర్హులున్నారని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికారులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూం అర్హుల్లో ఒక్కరు అనర్హులున్నా నేను ఈ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా. తండ్రి 15 ఏళ్లు, కొడుకు 25 ఏళ్లు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయి అం టూ గప్పాలు చెప్పిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ ఏ ఒక్క పేదవాడికైనా ఇల్లు కట్టించాడా?.
దశాబ్దాల కాలంగా అటవీ బిడ్డలు అవస్థలు పడ్డా పట్టించుకున్నాడా?. పెద్దవాగు పొంగిపొర్లి ప్రతీ వానకాలం ఎంతో మంది గర్భిణులు, బాలింతలు వైద్యానికి వెళ్లలేక మృత్యువాత పడ్డది నిజం కాదా?. ఎన్నడైనా రోడ్ల కోసం ఆ వంతెనల కోసం శ్రీపాదరావు గానీ, శ్రీధర్బాబు గానీ ఆలోచించారా?. వారికి మన ఓట్లు కావాలి.. కానీ మన పాట్లు వద్దు. ఇక్కడ 92 డబుల్ బెడ్రూం ఇండ్లు ఈ పేద బిడ్డలకు గూడు కల్పించేందుకే ప్రభుత్వం నిధులు ఇచ్చింది. జిల్లాలో మొట్ట మొదటి సారి డబుల్ బెడ్రూం ఇండ్లను మంథనిలో ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రారంభానికి మూడేళ్లుగా ముప్పు తిప్పలు పడుతున్నా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. అతను ఇవ్వడు.. మనల్ని ఇవ్వనివ్వడు. ఈ విషయాన్ని మంథని ప్రాంత ప్రజలు గుర్తించాలి.
సొంతింటి కలను సాకారం చేశాం:మంథని బల్దియా చైర్ పర్సన్ పుట్ట శైలజ
డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మా పేదింటి ఆడ బిడ్డల కలను సాకారం చేశాం. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులు అడుగడుగునా కుట్రలు, కుంత్రాలకు దిగినా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ సాయంతో డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు చేరేలా చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని నష్టాలు వచ్చినా మేం దంపతులిద్దరం ఈ నియోజకవర్గ ప్రజల కంచంలో మెతుకవుతాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలి. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, కౌన్సిలర్లు కొట్టే పద్మ రమేశ్, వీకే. రవి, నక్క నాగేంద్ర శంకర్, గర్రెపల్లి సత్యనారాయణ, కాయితీ సమ్మయ్య, కో-ఆప్షన్ సభ్యుడు యాకుబ్ పాల్గొన్నారు.