మెట్పల్లి రూరల్, సెప్టెంబర్ 23: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా, సంక్షేమానికి మారుపేరుగా నిలిచిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఉద్ఘాటించారు. శనివారం మెట్పల్లి మండలం రామలచ్చక్కపేటలో రామలచ్చక్కపేట, ఆత్మకూర్, ఆత్మనగర్, జగ్గసాగర్, పాటిమీది తండా, మెట్లచిట్టాపూర్లో మెట్లచిట్టాపూర్, విట్టంపేట, రంగారావుపేట, ఏఎస్సార్ తండా, కేసీఆర్ తండా గ్రామాల ఆసరా పింఛను లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 2,016, దివ్యాంగులకు 4,016 పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. 2,016 పింఛను మొత్తాన్ని సైతం సీఎం కేసీఆర్ త్వరలోనే పెంచనున్నట్లు వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దవాఖానల్లో మెరుగైన సేవలు, కేసీఆర్ కిట్టు, మోడల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటుతో ప్రజా సంక్షేమంలో తెలంగాణ పతాకస్థాయిలో నిలుస్తోందని చెప్పారు. 2018 వరకు పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి పింఛన్లు మంజూరవుతాయని వెల్లడించారు.
జాతరలో దుకాణాల మాదిరిగా ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులొచ్చి మాయమాటలు చెప్పిపోతారని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాలని సూచించారు. కాగా, రామలచ్చక్కపేట ముదిరాజ్ సంఘ భవనానికి, ఆత్మనగర్లో వడ్డెర సంఘానికి, జగ్గసాగర్ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి 3 లక్షల చొప్పున, కొండస్వామి కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు, సీసీ డ్రైన్కు 3 లక్షలు, ఆత్మనగర్లో కమ్యూనిటీ హాల్కు 3 లక్షలు, పద్మశాలి సంఘానికి 2 లక్షలు, ఆత్మకూర్లో తాత్కాలిక రోడ్డుకు 3 లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఆర్డీఓ మధు, ఎంపీడీఓ భీమేశ్రెడ్డి, తాశీల్దార్ శేఖర్, సర్పంచులు నరేశ్, లావణ్య, శ్రీనివాస్, సుగుణ, బుజ్జి, ఆకుల రాజరెడ్డి, గంగు, జమున, శంకర్నాయక్, ఎంపీటీసీ సభ్యులు తుమ్మల పుష్ప, జరుపుల రజిత, సదిరం లక్ష్మి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, పార్టీ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు గొర్రె పుష్ప, సహకార సంఘాల అధ్యక్షులు కేసిరెడ్డి నవీన్రెడ్డి పాల్గొన్నారు.
ఆత్మగౌరవంతో బతికేందుకే ఆసరా
వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు ఇస్తున్నరు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బీడీ కార్మిక, ఒంటరి మహిళలకు పింఛన్లు వారే ఇస్తున్నారని బీజేపీ వాళ్లు ఝూటా మాటలు మాట్లాడుతున్నరు. మరి నేనొక్కటే అడుగుతున్నా మోడీ సొంత రాష్ట్రం, బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో తెలంగాణ మాదిరి ఇస్తున్నారా..? చెప్పాలి. కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలంటూ పత్రాలు ముద్రించారు. వారు అధికారంలో వచ్చేది లేదు. అవి ఇచ్చేది లేదు.
– దావ వసంత, జడ్పీ చైర్సర్సన్
వాళ్లకు బాగుచేద్దామన్న ఆలోచనైతే లేదు
కరోనా ఆపత్కాలంలో సైతం ఆసరా పింఛన్లు చెల్లించిన ఘనత మన సీఎం కేసీఆర్ది. వ్యవసాయానికి మూడు గుంటలు విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్వాళ్లు మాట్లాడుతున్నరు. అటు మోటర్లకు మీటర్లు పెడుతామని ప్రధాని మోడీ అంటున్నరు. వారికి రైతును తిప్పలు పెడదామనే ఆలోచనే తప్ప బాగుచేద్దామన్న ఆలోచనైతే లేదు. 200 పింఛను సరిగా ఇవ్వని కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు 4 వే లు ఇస్తామంటే ఎలా నమ్మాలి? వాళ్ల మాటలు నమ్మితే మళ్లీ గోసపోవుడే. కడుపులో పెట్టి కాపాడుకుంటున్న బీఆర్ఎస్ను ఆదరించాలి.
– డా.సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి