సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ సరికొత్తగా మారింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే ఉపాధికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవ, ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్లతో కార్మికులకు దండిగా బతుకుదెరువు దొరుకుతున్నది. – సిరిసిల్ల రూరల్, మార్చి 29
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వరుస ఆత్మహత్యల నివారణ, కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పరిశ్రమల స్థాపన కోసం 2003లో అప్పటి ప్రభుత్వాలు టెక్స్టైల్ పార్కును ఆర్భాటంగా ప్రారంభించాయి. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 75 ఎకరాల్లో ఏర్పాటు చేసిన దీనిని ఎన్డీఏ, టీడీపీ ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్క్ పరిస్థితి మారలేదు. కాంగ్రెస్ పదేళ్లపాటు రాష్ట్రంతోపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు.
2009లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందిన కేటీఆర్ టెక్స్టైల్ పార్కుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్కు అభివృద్ధితోపాటు మెగా టెక్స్టైల్ జోన్గా ఏర్పాటు చేయాలని అప్పుడు రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుసార్లు విన్నవించారు. అయినా పట్టించుకోలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి రావడంతో మంత్రిగా కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పార్క్ అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పన, కార్మికులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకుసాగారు. ఈ క్రమంలో ప్రభుత్వం పార్క్ అభివృద్ధికి 14.50కోట్లు ఇవ్వగా, అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పించారు. ఇంకా మహిళలకు కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను టెక్స్టైల్ పార్కులోని కార్మికులకే ఇస్తున్నారు. అలాగే రంజాన్, క్రిస్మస్ కానుకలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, సింగరేణి కార్మికులకు యూనిఫాంతోపాటు అన్ని రకాల ఆర్డర్లను అందించి అండగా నిలిచారు. పార్కులో పరిశ్రమల ప్రోత్సాహానికి గాను 2010 నుంచి 2020 దాకా పవర్ వినియోగానికి 24కోట్ల సబ్సిడీ కూడా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో త్వరలోనే ఎన్వోసీ అమలు చేసి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించే విధంగా ప్రోత్సాహకం అందించి పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కార్మికుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు రాయితీలు ఇస్తున్నది. స్వరాష్ట్రంలో నేతన్న చేయూత, 10శాతం నూలు సబ్సిడీని వర్తింపజేసింది. చేయూత పథకం ద్వారా 248 మంది కార్మికులకు 1.006 కోట్లు అందజేసింది. నూలు సబ్సిడీ 10శాతం అందించేందుకు కార్మికులకు పాసుపుస్తకాలను ఇచ్చింది. ఈ పథకంలో 2018 సంవత్సరంలో 96 మందికి 5.14లక్షలు, 2019-2020 వరకు 277 మందికి 44లక్షలను వారి ఖాతాల్లో జమచేశారు. ఇంకా టెక్స్టైల్ పార్క్లో 2017లో జూకీ కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటివరకు 1800 మందికిపైనే శిక్షణ ఇచ్చారు. దీనికితోడు 2019లో సమర్థ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 220 మందికి కుట్టు శిక్షణ ఇప్పించి, అన్ని రకాల దుస్తుల తయారీ కోసం పెద్దూరులో ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్క్లో ఉపాధి కల్పిస్తున్నారు.
టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలకు గత ప్రభుత్వాలు విద్యుత్ రాయితీ ప్రకటించాయే తప్ప అమలు చేయలేదు. 2009లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేటీఆర్ టెక్స్టైల్ పార్క్ పరిశ్రమలకు విద్యుత్ రాయితీలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాలను కోరినా ఫలితం లేకపోయింది. మన రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ రాయితీలు అందిస్తామని అప్పుడు యాజమానులకు హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 2010నుంచి 2014 వరకు విద్యుత్ సబ్సిడీని సైతం మంజూరు చేయించి, అందించారు. 2010 జనవరి నుంచి 2014 డిసెంబర్ వరకు 50శాతం విద్యుత్ రాయితీ 8.65కోట్లు అందించారు. తర్వాత 2015 జనవరి నుంచి 2020 డిసెంబర్కు విద్యుత్ రాయితీ 15.36 కోట్లు అందజేసి అండగా నిలిచారు.
టెక్స్టైల్ పార్క్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం 2015లో 14.50కోట్లను కేటాయించారు. వీటితో పరిపాలన భవనం, భోజన శాల, సామూహిక మరుగుదొడ్లు, రగుడు ఫిల్టర్ బెడ్ నుంచి 11.6 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా నీటి సౌకర్యం, నాలుగు లైన్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్లు, డ్రైనేజీలు, సమర్ధ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.
వస్త్ర పరిశ్రమలో నూతన సాంకేతిక విప్లవం దిశగా యజమానులు ముందడుగు వేస్తున్నారు. పార్కులో ప్రస్తుతం రేపియర్ లూం ద్వారా 200 మీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. అయితే ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చిన ఎయిర్జెట్ లూం 800 నుంచి 1000 మీటర్ల దాకా తయారు చేస్తున్నది. ఇలాంటి లూంలు కొనుగోలు చేయాలని టెక్స్టైల్స్ పార్కు అసోసియేషన్ నిర్ణయించింది. పాలిస్టర్ వస్ర్తాలకు స్వస్తి చెప్పి 100 శాతం కాటన్, విస్కోస్ లాంటి వస్ర్తాలను తయారు చేసేందుకు ముందుకు పోతున్నారు. అధునాతన సైజింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతోపాటు 50 లక్షల నుంచి కోటి దాకా విలువైన ఎయిర్జెట్లను కొనుగోలు చేసి, వాటికి అనుగుణంగా ఏసీ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిపైన తయారు చేసిన వస్ర్తాలకు తమిళనాడు తరహాలో మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఆదిత్యబిర్లా యాజమాన్యం ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చింది. పరిశ్రమ ఆధునికరణతో వేల మందికి ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పార్కులోని విజయసాయి టెక్స్టైల్స్ యూనిట్లో 8 వరకు ఎయిర్జెట్లూంలు ఏర్పాటు చేశారు.
మంత్రి కేటీఆర్తోనే సిరిసిల్ల టెక్స్టైల్పార్క్ మనుగడ సాధించింది. కేటీఆర్ ముందు చూపుతో ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇప్పించడంతో కార్మికులు, యజమానులు, ఇండస్ట్రీకి పనిదొరికింది. పరిశ్రమలు మనుగడ సాధించాయి. కరోనా టైంలో దేశంలోని పరిశ్రమలు మూతపడ్డా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బ్రహ్మాండంగా నడిచింది. పార్కులో సుమారు 1000 నుంచి 1500 మంది కార్మికులు, సిరిసిల్లలో 15వేల మంది ఉపాధి పొందారు. కార్మికులు మెరుగైన వేతనం, మంచి జీవన విధానాలు ఏర్పరుచుకున్నారు. ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందారు. ఇదంతా మంత్రి కేటీఆర్ కృషితోనే సాధ్యమైంది. ఆయన ఆలోచనలతో భవిష్యత్తులో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నిశ్చలకరింజి, తమిళనాడులోని తిరుపూర్లా మారే అవకాశమున్నది. మంత్రి కేటీఆర్కు కార్మికులు,యాజమానుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– అన్నల్ దాస్ అనిల్, అధ్యక్షుడు, టెక్స్టైల్ పార్క్ యాజమానుల అసోసియేషన్ (సిరిసిల్ల)
మాది హుస్నాబాద్ మండలం పోతారం. టెక్స్టైల్ పార్క్లో పదేళ్ల నుంచి పనిచేస్తున్న. నాకు గతంలో నెలకు 5వేల నుంచి 7వేల వరకే కూలి వచ్చేది. ఇప్పుడు బతుకమ్మ చీరలు, యూనిఫాంల తయారీ ఆర్డర్లతో కూలి ఎక్కువగా వస్తున్నది. ప్రతి 15 రోజులకు కూలి ఇస్తున్నరు. నెలకు 14వేల నుంచి 16వేల దాకా దొరుకుతంది. ఇంకా ఎక్కువ పనిచేస్తే ఎక్కువ పైసల్ వస్తయ్. కేటీఆర్ సార్ లేకపోతే
ఇక్కడ పని లేకపోవు. మళ్ల బీవండి, షోలాపూర్కు పోయేటోళ్లం. ఆర్డర్లు ఇట్లనే ఇవ్వాలె.
– మేర్గు సాయన్న, కార్మికుడు
మంత్రి కేటీఆర్ సారథ్యంలో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ కానుకల తయారీ ఆర్డర్లు ఇస్తోంది. విద్యుత్ రాయితీలు ఇచ్చాం. మౌలిక వసతులు ఏర్పాటు చేసినం. త్వరలోనే క్యాంటీన్ను ప్రారంభిస్తాం. పార్క్లో కొంత మంది పాత పారిశ్రామిక వేత్తలు కొన్ని కారణాలతో కొనసాగలేమని అంటుండగా, అదే సమయంలో నూతన పారిశ్రామికవేత్తలు, యువకులు పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్నరు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే ఎన్వోసి రాబోతుంది. దీంతో మరికొంత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం ఇస్తాం.
– గూడూరి ప్రవీణ్, టెక్స్టైల్, పవర్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
సిరిసిల్లకు 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్కు ముందు నుంచి సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ, నేతకార్మికుల సమస్యలు, ఉపాధి కల్పనపై స్పష్టమైన అవగాహన ఉంది. కార్మికులకు చేతినిండా పని, యజమానులకు ఆర్డర్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సంకల్పించారు. అందుకు స్వరాష్ట్రంలో కార్యాచరణ మొదలు పెట్టారు. నేతకార్మికులు ఉపాధి కల్పించడం, పరిశ్రమలు నడవాలని బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్లకు అందించారు. ఇంకా యూనిఫాంలు, రంజాన్, ముస్లిం పండుగలకు సంబంధించిన కానుకల తయారీ ఆర్డర్లను కూడా ఇప్పించారు. దీంతో వలసలు, ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేశారు. అంతే కాదు కార్మికుల జీవన ప్రమాణాలు, ఆలోచన విధానాల్లో మార్పులు తెచ్చారు. ఈ క్రమంలో టెక్స్టైల్ పార్కుకు జీవం పోశారు. ప్రస్తుతం 165 ఇండస్ట్రీయల్, 27 కమర్షియల్ యూనిట్లకు స్థలం కేటాయించారు. ప్రత్యక్షంగా 1000 మంది కార్మికులు, పరోక్షంగా 200 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.