Gangula | కార్పొరేషన్, మార్చి 31 : కరీంనగర్ నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీసుకువస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఎల్ఎండీలో 5.7 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, దీనిలోనూ 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజీగా ఉంటుందన్నారు. ఉన్న మూడు టీఎంసీల నీటితో నగరానికి వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడటం అసాధ్యమేనని తెలిపారు. వెంటనే పై నుంచి నీటిని విడుదల చేసి ఎల్ఎండీలో 10 టీఎంసీలకు తక్కువ కాకుండా నీటి మట్టం ఉండేలా చూడాలన్నారు. వారం రోజుల్లోగా ఈ చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళన బాట పడుతామని హెచ్చరించారు.
సోమవారం నగరంలోని ఎల్ంఎడీలోని నీటిమట్టాన్ని పరిశీలించారు. నీటి మట్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమైక్య రాష్ర్టంలో తాగునీటి కోసం యుద్ధాలు చేసిన పరిస్థితులు ఉన్నాయని, తానే ఎమ్మెల్యేగా 2012లో నగర తాగునీటి కోసం పోరాటం చేసి, కిందకి నీరు విడుదల చేయకుండా ఇసుక బస్తాలు వేసి అడ్డుకున్నది తమకు గుర్తుకు ఉందన్నారు. కానీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఎప్పుడు రాలేదని, ఏ రోజు కూడా ఎల్ఎండీలో నీటి మట్టం ఎంత ఉందని సందర్శన చేయాల్సిన పరిస్థితి రాలేదన్నారు. ప్రతీ వేసవిలోనూ సర్పేస్ వాటర్ ఉండే విధంగా కేసీఆర్ చూశారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో కరీంనగరంలో రోజు తప్పించి నూరి ఇచ్చే పరిస్థితి నుంచి ప్రతి రోజు మీరు అందించే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. తాగు, సాగునీటికి ఎప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే ఎల్ఎండీలో ఎట్టి పరిస్థితుల్లోనూ 13 టీఎంసీలకు తగ్గకుండా నీటిమట్టం ఉండాలని 2017 అక్టోబర్ 30 జీవో నంబర్ 885ను జారీ చేశారన్నారు.
ఎల్ఎండీ వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్
దీంతోనే తాము నగరంలో ప్రతీరోజు నీటి సరఫరా చేస్తూనే కొన్ని ప్రాంతాల్లో 24 గంటల నీటి తరఫున ఇచ్చేందుకు ప్రణాళికలు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ హాయంలో ఏ రోజు కూడ నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేశామన్నారు. కానీ ఎల్ఎండీలో ఇప్పుడు 5.70 టీఎంసీ నీరు మాత్రమే ఉందన్నారు. దీని వల్లే తాము ఎల్ఎండీని సందర్శించాల్సినా పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్న నీటిమట్టంలోనూ 2.5 టీఎంసీ డెడ్ స్టోరేజ్ అని పేర్కొన్నారు. ఇక మిగిలింది మూడు టీఎంసీల నీరేనని దాని ద్వారా తాగు, సాగునీటి అవసరాలను ఎలా తీర్చుతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండీ నుంచి కిందికి నీటిని విడుదల చేసే గడువు నేటితో ముగియాల్సి ఉందని, కానీ ఇరిగేషన్ అధికారులు మరో మూడు రోజులు పొడగించారని గుర్తు చేశారు. దీని వల్ల మరింత నీరు కిందికి పోయి ఎల్ఎండీ నీటిమట్టం పడిపోతుందన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎల్ఎండీలో నీటిమట్టం తగ్గిపోతుందని నగరానికి సంబంధించి నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నగరపాలక అధికారులకు లేఖ రాశారని పేర్కొన్నారు.
నెల రోజులుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రోజు నీటి సరఫరాను బంద్ చేసి రోజు తప్పించే రోజు నీటి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే బూస్టర్ పంపులను ఆన్ చేసి నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఎల్ఎండీలో ఉన్న మూడు టీఎంసీల నీటితో వచ్చే మూడున్నర నెలల పాటుగా నగరానికి ఎలా ఇబ్బందులు లేకుండా మంచినీటి సరఫరా అందిస్తారని నిలదీశారు. ఎండలు పెరిగే కొద్ది నీటి ఆవిరి కావటం పెరుగుతుందని, దీని వల్ల నీటి మట్టం తగ్గటం, కిందికి నీటి విడుదల వల్ల మరింత నీరు లేకుండా పోతోందని, ఉన్న నీటి ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్నించారు. మధ్యమానేరులో 9 టీఎంసీల నీటి మాత్రమే ఉందని, ఎల్లంపల్లిలో కూడా 9 టిఎంసీల నీరు ఉందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 16 టీఎంసిలు నీరు ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం కళ్లు తెరిచి నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో సాగునీరు అందించలేక పంటలన్ని ఎండబెట్టారని తాగునీరు లేక ప్రజల్ని ఎండబెట్టవద్దని పేర్కొన్నారు. మార్చి 31 నాటికే తాగునీటి పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న నీటితో నగరానికి ప్రస్తుత స్థాయిలో తాగునీరు అందించలేరని విమర్శించారు.
మరో వారం రోజులు గడువు మాత్రమే ఇస్తామని ఎవరో ఒక మంత్రి ఇన్ఛార్జీ తీసుకొని వెంటనే ఎల్ఎండిలో నీటి మట్టాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. మధ్యమానేరు నుంచి 2500 క్యూస్కెక్యుల నీరు మాత్రమే వస్తుందని, ఇది ఏమాత్రం సరిపోదని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ఎల్ఎండీ నుంచి నీటిని కిందికి వదలకుండా బస్తాలతో అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ఆ పని చేయాల్సినా కింది ప్రాంతాలు కూడా తెలంగాణ వాసులేనని అక్కడ పంట పొట్టకు వచ్చిన దశలో ఉందని అందుకే కిందికి నీటిని వదులుతున్న ఉద్యమించటం లేదన్నారు. కిందికి నీటి వదులుతున్నప్పుడు పై నుంచి నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఏ విధంగానైనా ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసి ఎల్ఎండీలో కనీసంగా 10 టీఎంసీల నీరు ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాము ప్రజల తరుపున ఉద్యమాలు చేయాల్సి వస్తుందనార్నరు. కేసీఆర్ పదేళ్ల పాలనలో నగరంలో ఎక్కడ కూడ మహిళలు బిందెలను తీసుకొని రోడ్లపైకి వచ్చే పరిస్థితి రాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బిందెలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు రాజేందర్రావు, ఐలేందర్, వాల రమణరావు, మేచినేని అశోకరావు, మాజీ ప్రజాప్రతినిధులు సంపత్రావు, తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు.