‘స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శకంగా పథకాలను అమలుచేస్తున్నరు. కార్యకర్తలకు సంబంధం లేకుండా, ప్రజలే కేంద్ర బిందువుగా పాలన సాగిస్తున్నరు. ఈ ప్రభుత్వం మీది.. ప్రతి పైసా మీదే. మీరు కట్టే పన్నులపైనే ఈ సర్కారు నడుస్తుంది. రాష్ట్రంలో గుడిసెల్లేని నియోజకవర్గంగా సిరిసిల్లను చేస్తా. అర్హులందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాదే. నాపై విశ్వాసం ఉంచాలని’ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం సిరిసిల్ల కలెక్టరేట్లో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి 577 డబుల్ బెడ్రూం ఇండ్లపట్టాలు, 747 మందికి గృహలక్ష్మి ప్రొసీడింగ్లు, స్థలంలేని అర్హులకు ప్రొసీడింగ్లు, 561 మంది ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు జంబో చెక్ అందజేసి, మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎవరైనా లబ్ధిదారులు లంచం ఇచ్చారా..? అని ప్రశ్నించిన ఆయన, లంచం తీసుకున్న అధికారిని సస్పెండ్ చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. ఎట్లుండే సిరిసిల్ల.. తెలంగాణ సాధన తర్వాత ఎట్లయిందో గమనించి, ఆదుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా ఎన్నుకోవాలని కోరారు.
– సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్/తెలంగాణ చౌక్, అక్టోబర్ 3
సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్/తెలంగాణ చౌక్, అక్టోబర్ 3 : ‘తెలంగాణలో గుడిసె లేని నియోజకవర్గంగా సిరిసిల్లను చేస్తా. అర్హులందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాది’ అని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 4:30 గంటలకు సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న మంత్రి కేటీఆర్, మధ్యాహ్నం 4:40 గంటలకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. కార్యక్రమం సాయంత్రం 5:30 గంటలకు పూర్తవగా, 5:40 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు.
కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. పండుగ వాతావరణంలా పట్టాల పంపిణీ జరుగుతుంటే సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎవరైనా లబ్ధిదారులు లంచం ఇచ్చారా..? అని అడిగారు. లంచం తీసుకున్న అధికారిని సస్పెండ్ చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. తెలంగాణలో పారదర్శకంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, తదితర పథకాలను కార్యకర్తలకు సంబంధం లేకుండానే పారదర్శకంగా లబ్ధిదారుడికి అందుతున్నాయన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు. ప్రజలందరికీ పనులు జరుగాలని, ప్రజలు నమ్మేలా పాలన కొనసాగిస్తే ప్రజలే గెలిపిస్తారని సీఎం కేసీఆర్ తనతో అన్నారని కేటీఆర్ చెప్పారు.
రాష్ట్రంలో గుడిసెల్లేని నియోజకవర్గంగా సిరిసిల్లను చేస్తానని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్వర్యంలో అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి, గుడిసెలు, రేకుల షెడ్డులు, శిథిలావస్థలో ఉన్న మొత్తం 1747 మందిని అధికారులు గుర్తించారన్నారు. వారి వారి నివాసాల వద్ద ఫొటోలు తీసి బుక్లు తయారు చేశారని, దీని ద్వారా నిజమైన అర్హుల లెక్క తేలిందని చెప్పారు. ఎలాంటి దరఖాస్తు లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా నిజమైన అర్హులకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదని కేటీఆర్ హమీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలో స్థలం ఉండి ఇండ్లు లేని వారు 1300 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి గృహలక్ష్మీ పథకంలో ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో 2800 మందిలో మండేపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో 1260 మందికి ఇప్పటికే లక్కీ డ్రాలో డబుల్ బెడ్రూంలు కేటాయించామని, లక్కీడ్రాలో రానివారికి నేడు పెద్దూర్లో 512, రగుడులో 65 డబుల్ బెడ్రూం పట్టాలు అందిస్తున్నామని చెప్పారు.
ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకోనైనా అందరికీ గృహలక్ష్మీ మంజూరు చేసి ఇండ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సొంత స్థలాలు ఉండి ఇండ్లు లేని వారు 747 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మీ ప్రొసీడింగ్ కాపీలను మంత్రి అందించారు. ఇంకా అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే పైరవీ కారులకు ఒక్కరూపాయి ఇవ్వకుండా కేటీఆర్ మాకు ఇండ్లు కట్టిస్తానని చెప్పిండని వారితో చెప్పాలని, బరాబర్ ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఉద్ఘాటించారు. ‘ఈ ప్రభుత్వం మీది.. ప్రతి పైసా మీదే. మీరు కట్టే పన్నులపైనే ప్రభుత్వం నడుస్తుంది’ అని పునరుద్ఘాటించారు. ఇప్పటికే సిరిసిల్లలో 90శాతం ఇండ్ల ప్రక్రియ నేరవేర్చామని, మిగతా వారందరికీ ఇస్తామని, తమపై విశ్వాసం ఉంచాలని, మీ ఇంటికే అధికారులు వస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయా మండలాల్లో నా యకులు సహకరిస్తున్నారని, ప్రజాప్రతినిధులకు ధన్యావాదాలు అని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణ సాధన తర్వాత సిరిసిల్ల ఎట్లా మారిందో, మార్పును ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ కోరారు. సిరిసిల్ల ఎడ్యూకేషన్ హబ్గా మారిందని, మెడికల్ కళాశాల మంజూరైందని, రోడ్లు,తాగునీరు. తదితర అంశాలు అభివృద్ధిలో దూసుకెళ్లాయని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ప్రజలకు మల్కపేట రిజర్వాయర్ -9వ ప్యాకేజీ కల్పతరువని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశామని, త్వరలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మల్కపేట రిజర్వాయర్ ద్వారా గంభీరావుపేట మండలంలోని సముద్రాలింగాపూర్లోని సింగసముద్రం, గంభీరావుపేట మండల కేంద్రంలోని బట్టల చెరువు నుంచి నర్మాల వద్ద ఎగువమానేర్ జలాశయానికి కాళేశ్వర జలాలు చేరనున్నాయని చెప్పారు.
జిల్లాలోని కేసీఆర్ క్రీడా ప్రాంగణాలకు మంత్రి కేటీఆర్ స్పోర్ట్ కిట్స్ అందించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్నగర్, ముష్టిపల్లి క్రీడా ప్రాంగణాలకు స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చామని, ఒకటి రెండు రోజుల్లో మిగతా క్రీడా ప్రాంగణాలకు అందిస్తారని చెప్పారు.
జిల్లాలోని 561 మంది ఎస్సీ స్వయం ఉపాధి లబ్ధిదారులకు రూ.14.60 కోట్లు రాయితీకి సంబంధించిన జంబో చెక్కును మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు అందించారు.
మీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమర్థుడని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలో అర్హులైన గుడిసెలు, ఇండ్లు లేని, శిథిలావస్థలో ఉన్న అర్హులను గుర్తించామని, తాను చెప్పిన వారం రోజుల్లో జియోట్యాగింగ్తో క్షేత్ర స్థాయిలో అధికార బృందంతో సర్వే చేపట్టి 1747 మంది అర్హులున్నారని గుర్తించారని చెప్పారు. వీరికి గృహలక్ష్మీ పథకంలో ప్రాధాన్యత ఇచ్చి ఇండ్ల నిర్మాణంలో అర్థిక సాయం అందచేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ అనురాగ్ జయంతికి, అధికార బృందానికి మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు దయతోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు ఈ గౌరవం దక్కిందని కేటీఆర్ అన్నారు. ‘హెలికాప్టర్లో వస్తుండు.. పెద్దోడు అయిండని ఏమీ అనుకోకుండ్రి. పలు కార్యక్రమాల్లో హాజరుకావాల్సి ఉండడంతో హెలికాప్టర్లో ప్రయాణం తప్పడం లేదని’ వివరించారు. ‘నాక్కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి మాట్లాడాలని ఉంది. కానీ సమయభావం వల్ల మాట్లాడలేక పోతున్నా. ఏమీ అనుకోవద్దు. ఎన్నికలప్పుడు ఆగం కావద్దు. మీ వద్ద జరిగిన మార్పును ఆలోచించి ఆదుకోనే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి’ అని సూచించారు. మీ అందరి ఆశీర్వాదంతోనే సీఎం కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా ఎన్నుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను అందించారు.
సిరిసిల్ల పర్యటనకు వచ్చిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీలకు జడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవితోపాటు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహజన్ పుష్పగుచ్ఛచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, అదనపు కలెక్ట ర్ గౌతంరెడ్డి, ఆర్డీవో అనంద్కుమార్ ఉన్నారు.