తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 26: గతంలో పొలాన్ని కొడవలితో కోసి, కల్లం చేసి, గడ్డిని వాములు చేసుకునేటోళ్లు. రైతు బతికేందుకు పంట పండించుకున్నట్టే.. రైతుకు చేదోడు, వాదోడుగా ఉండే పశువులకు మళ్లీ పంటవచ్చే దాకా వరి గడ్డిని నిల్వ చేసుకునేటోళ్లు. అనంతరం హార్వెస్టర్లు వచ్చి సగం పని తప్పించినా.. కోసిన గడ్డిని కుప్ప పెట్టుకునేందుకు ఇబ్బందిగా ఉండేది. గడ్డి కుప్పలు పెట్టుకునేందుకు స్థలం కూడా ఎక్కువగా కావాల్సి వస్తుండేది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న యాంత్రికీకరణ రైతులకు ఎంతో పని, శ్రమ, సమయాభావాన్ని తగ్గిస్తున్నది. గడ్డిని కుప్పలు చేసి మోపులు పెట్టి వాము పేర్చే పని లేకుండా ‘బేలర్’ యంత్రం వచ్చేసింది. హార్వెస్టర్లు కోసిన వరిగడ్డిని బేలర్ సునాయాసంగా కట్టలు కడుతున్నది. ఇక రైతు వాటిని తీసుకెళ్లి భద్రపర్చుకోవడమే తరువాయి.
‘బేలర్’ ఇలా పని చేస్తుంది
సాధారణంగా రైతులు వినియోగించే ట్రాక్టర్కు బేలర్ యంత్రాన్ని హైడ్రాలిక్ సిస్టంతో అమర్చుతారు. ఈ యంత్రం పొలంలో అక్కడక్కడా పడి ఉన్న గడ్డిని పికప్ యూనిట్ ద్వారా తీసుకుంటుంది. యంత్రంలోని రోలర్ సహాయంతో గడ్డిని కట్టగా తయారు చేస్తుంది. కట్ట తయారయ్యాక యంత్రంలోని ఒక భాగంలో ఉండే దారంతో కట్టను గట్టిగా కడుతుంది. కట్ట తయారయ్యే విధానం యంత్రంపై బిగించిన బేల్ ఇండికేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. కట్ట తయారు కాగానే డ్రైవర్ దగ్గర ఏర్పాటు చేసిన కంట్రోల్ బాక్సులో లైట్ వెలుగుతుంది. తర్వాత కంట్రోల్ బాక్సులో ఉన్న బెల్ ఎజెక్షన్ స్విచ్ నొక్కి డ్రైవర్ బేలర్ యంత్రంలోని గడ్డికట్టను బయటకు పంపుతాడు. ఎన్ని కట్టలు తయారయ్యాయనే విషయం కూడా బేల్ కంట్రోల్ బాక్సులో స్క్రీన్పై తెలిసిపోతుంది. ఒక్క గడ్డి కట్ట కట్టడానికి రూ.30-35 తీసుకుంటున్నారు. ఇందులో రెండు రకాలు కట్టలు కట్టే యంత్రాలు ఉంటాయి. ఒకటి రౌండ్గా చుట్టేది, ఇంకోటి చతురస్రాకారంలో చుట్టేది
ఎన్నో ఉపయోగాలు..
గత రెండేళ్ల నుంచి గడ్డి వాములు దాదాపు మాయమైపోతున్నాయి. ఈ బేలర్ విధానం ద్వారా గడ్డిని చుట్టలు చుట్టిన తర్వాత నిల్వ చేయడం ఎంతో సులువుగా మారింది. గడ్డి కట్టలను పొలం నుంచి కొట్టాలకు సులువుగా తరలించుకుంటున్నారు. అతి తక్కువ మందితో గడ్డి మోపులను సేకరించుకోవచ్చు. శ్రమ, పని, స్థలం ఇలా అన్నీ తక్కువలో అయిపోతున్నాయి. గడ్డి వృథా పోకుండా రైతుకు ఎంతో కొంత లాభం వస్తున్నది. కూలీల కొరతను అధిగమించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, యువకులు ఈ యంత్రాన్ని కొనుక్కుని ఉపాధి పొందుతున్నారు.