కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ జమ్మికుంటలో నిర్వహించిన సభను చూసి బీజేపీకి గుబులుపడుతున్నది. ఆ పార్టీకి చెందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గుండెలు ఆదురుతున్నయ్. 50 వేల మంది తరలిరావడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నరు’అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి విరుచుకుపడ్డారు. గవర్నర్పై తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమున్నదని, అది తెలంగాణ యాస అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో, కౌన్సిల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన కుర్చీ కింద తొక్కిపెడుతున్నారన్న భావనతో మాట్లాడిన తన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించారని మండిపడ్డారు. తనకు మహిళలంటే ఎంతో గౌరవముందని, తన నియోజకవర్గంలో ఏ మహిళను అడిగినా ఈ విషయం చెబుతారన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఈటల రాజేందర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దునుమాడారు. తాను కేసీఆర్ శిష్యుడినని, ఏవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. బుధవారం కరీంనగర్లోని మంత్రి గంగుల కమలాకర్ మీ సేవా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జమ్మికుంట సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి, అంతకుముందు కమలాకర్పూర్కు 2001 నుంచి బీఆర్ఎస్కు నాయకుడే లేడని, కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ బలపడిందన్నారు. తాను మంత్రిగా ఉన్నపుడు చేసిన పనులను ఇపుడు ప్రారంభిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కౌశిక్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఏమైనా తన తండ్రి సొమ్ముతో అభివృద్ధి పనులు చేశాడా? అని ప్రశ్నించారు. ఆయన మంత్రిగా ఎవరి ప్రభుత్వంలో పని చేశారని? ఎవరిచ్చిన సొమ్ముతో అభివృద్ధి చేశారని? నిలదీశారు.
నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 14 నెలల్లో కేంద్రం నుంచి తట్టెడు మట్టి కూడా తెచ్చి పొయ్యలేదని, సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను తాను చేశానని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం రమ్మని తాను సవాలు విసిరితే తోక ముడిచి పారిపోయిన ఆయన, ఇపుడు అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం ఈటలకు అలవాటేనని, తనను గెలిపించిన ప్రజల సమస్యలు గాలికొదిలి మీడియా ఎదుట ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈటల స్వగ్రాం కమలాపూర్లో మంత్రి కేటీఆర్కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారని, ఆయనను గెలిపించి తప్పు చేశామన్న భావనలో కనిపిస్తున్నారని అన్నారు. గవర్నర్ తమిళరాజన్ సై పై తాను చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు ఉలిక్కి పడ్డారని, రాజ్యాంగ బద్దమైన పోస్టులో ఉన్న వ్యక్తిని విమర్శించకూడదని అంటున్నారని, మరీ బీజేపీ నాయకులు, ఎంపీ అర్వింద్, బండి సంజయ్ అదే రాజ్యాంగ పదవిలో ఉన్నసీఎం కేసీఆర్ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు.
ఒక మహిళను ఉద్దేశించి అలా మాట్లాడవద్దని నీతులు చెబుతున్న బీజేపీ నాయకులు, ఎమ్మెల్సీ కవితపై ఎందుకు అనుచిత విమర్శలు చేస్తున్నారో చెప్పాలన్నారు. వాళ్లు తిడితే తప్పు లేదుగాని మేము తిడితే తప్పు వచ్చిందా అని ప్రశ్నించారు. గవర్నర్పై తాను చేసిన వ్యాఖ్యలను జాతీయ చానళ్లలో చూపినందుకు బీజేపీ నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ చర్యల ద్వారా సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని గవర్నర్ అడ్డుకుంటున్న విషయం దేశ ప్రజలకు తెలిసి పోయిందన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రధాత అని మీరే ఒప్పుకున్నారని అన్నారు. తెలంగాణ గవర్నర్ కార్యాలయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలా మారిందని, ఢిల్లీ డైరెక్షన్లో నడుస్తున్నదని దుయ్యబట్టారు. ఒక బీజేపీ ఎమ్మెల్యే తండ్రి చనిపోతే వెళ్లి పరామర్శించిన గవర్నర్ మంత్రులైన గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ తండ్రులు చనిపోతే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచినా ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ హాజరు కావడం లేదని, చివరికి తన సొంత గ్రామంలో తన కమ్యూనిటీకి చెందిన భవనంతో పాటు అనేక కులాలకు సంబంధించిన భవనాలకు శంకుస్థాపనలు చేసేందుకు పిలిచినా రాకపోవడం విడ్డూరమన్నారు.
హుజూరాబాద్ను ఉద్దరించే స్థితిలో లేని ఈటల రాజేందర్ రాష్ర్టాన్ని ఎలా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. త్వరలో హుజూరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూడా మంత్రుల చేతుల మీదుగా ప్రారంభిస్తామని, కనీసం ఈ కార్యక్రమానికైనా హాజరు కావాలని ఎమ్మెల్సీ ఈటలను కోరారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని తానేనని మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు పార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో నిన్నటి బహిరంగ సభలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మాట తాను అనడం లేదని, కేసీఆర్ ఆశీర్వాదంతో కేటీఆర్ ప్రకటించారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జమ్మికుంట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజ్కుమార్, హుజూరాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ కే శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.