హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 16 : హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఓ ముస్లిం మహిళలను వేధించిన గ్రామ సర్పంచ్కి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వత్తాసు పలకడం దుర్మార్గమని హుజూరాబాద్ ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని మండలి విప్ కౌశిక్రెడ్డి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ కార్యకర్తను కాపాడుకునేందుకు ప్రజలను ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చెల్పూరుకు చెందిన ముస్లిం మహిళ అదే గ్రామంలో రోడ్డు పకన డబ్బా వేసుకొని చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నదని, ఆమెపై కక్షతో సర్పంచ్ మహేందర్ డబ్బా ఎలాగైనా తొలగించాలని మూడేళ్లుగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనకు జీవనోపాధి కల్పిస్తున్న డబ్బా కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కలెక్టర్కు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నదని, అయినా సర్పంచ్ తరచూ మానసికంగా వేధించడంతో భరించలేకనే ఆమె ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు.
ఈ విషయంపై బాధిత మహిళ కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, దీంతో పట్టణ సీఐ రమేశ్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి మహిళను వేధించిన సర్పంచ్, ఓ వార్డు సభ్యుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చట్టపరంగా నిందితులను అరెస్ట్ చేసిన సీఐపై ఈటల రాజేందర్ విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు. సీఐ చేసిన నేరమేంటని ఈటలను ప్రశ్నించారు? మహిళను వేధించిన సర్పంచ్, వార్డు సభ్యుడిపై కేసు నమోదు చేయడం నేరమా? అని ప్రశ్నించారు? అసలు విషయాన్ని పకన పెట్టి ఈటల ఇతర విషయాలు మాట్లాడడం, సంబంధంలేని వాటిని అంటగట్టి ప్రజలను తప్పుదారి పట్టించడం సరికాదని హితవుపలికారు. అన్యాయం, అక్రమాలు చేస్తున్న వారికి తొత్తుగా మారారని ధ్వజమెత్తారు. మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరిగితే అడ్డుకుంటామని హెచ్చరించారు.
సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పావని
రాజకీయ భిక్షపెట్టిన సీఎం కేసీఆర్పై ఈటల రాజేందర్ అనవసర మాటలు మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పావని హెచ్చరించారు. వడదెబ్బ తగిలిన వ్యక్తి మాదిరిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, రాజకీయ లబ్ధి కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళను వేధించిన సర్పంచ్కు మద్దతుగా ధర్నా చేస్తున్న ఈటల రాజేందర్ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారా? అని నిలదీశారు. కౌశిక్రెడ్డికి నియోజకవర్గంలో వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేకనే ఈటల మతితప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ నేతలమంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ నిర్మల, మహిళా ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కల్లెపల్లి రమాదేవి, ఉజ్మానూరిన్ ఇమ్రాన్, మారపెల్లి సుశీల, గోవిందుల స్వప్న, మొలుగు సృజన-పూర్ణచందర్, కొండ్ర జీవిత-నరేశ్, మంద ఉమాదేవి, మహిళా నాయకులు కొయ్యడ శ్రీదేవి, వకుళ, మాధవి, రాణి, అన్నపూర్ణ, శోభ పాల్గొన్నారు.