వీణవంక, నవంబర్ 21: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం పంట రుణ మాఫీ చేయడం జరిగిందని, ఇంకా మాఫీ కాని రైతులు అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని రామకృష్ణాపూర్, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎలుబాక, గంగారం, బొంతుపల్లి, కిష్టంపేట, లస్మక్కపల్లి, పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్నగర్ గ్రామాల్లో మంగళవారం ఆయన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రచారం చేశారు. ప్రతి గ్రామంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు, కోలాటం కళాకారుల నృత్యాలు, మంగళ హారతులతో పాడి కౌశిక్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, పంట రుణమాఫీతో రైతుపక్షపాతిగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం మంది రైతులకు లక్షలోపు పంట రుణమాఫీ అయిందని, కాని వారు అధైర్యపడొద్దని, అవసరమైతే ఎన్నికల అనంతరం తన ఇంటికి వచ్చి కలవొచ్చని, పంటరుణ మాఫీ చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
కళ్లబొల్లి మాటలు చెప్పే వారిని నమ్మొద్దని, రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కటిక చీకటిలో మగ్గాల్సి వస్తుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులను, పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులను మరిచిపోవద్దని సూచించారు. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని, ఎన్నికల సమయంలో వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఏడు సార్లు గెలిచి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలో తట్టెడు మట్టి పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే రూ.వెయ్యి కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్తోనే అభివృద్ద్ధి సాధ్యమని, మూడోసారి సీఎం కేసీఆర్ అవుతారని స్పష్టం చేశారు. హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్తోనే నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దని, అభివృద్ధి చేస్తున్న పార్టీని ఆదరించాలని కోరారు.
ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారని, మన మధ్యలో ఉంటూ పేదల అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రఘుపాల్రెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు వీరారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు మ్యాకల సమ్మిరెడ్డి, బండ సుజాత-కిషన్రెడ్డి, కాంతారెడ్డి, పింగిలి కోమల్రెడ్డి, చదువు లక్ష్మీమహేందర్రెడ్డి, బండారి ముత్తయ్య, దాసారపు సుజాత-లక్ష్మణ్, ఎంపీటీసీలు మూల రజిత-పుల్లారెడ్డి, చదువు స్వరూప-నర్సింహారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దరిపెల్లి రవీందర్, శ్రీనివాస్, భూమయ్య, నాయకులు ముదుగంటి శ్యాంసుందర్రెడ్డి, మధురెడ్డి, రాజకొమురయ్య, దాసారపు శంకర్, ముత్యాల శంకర్, రాజిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రభాకర్, జక్కు నారాయణ, జితేందర్రెడ్డి, రాజ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచులు, సింగిల్విండో డైరెక్టర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.