Dalit Bandhu | దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన దళితబంధును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా పక్కా చర్యలు చేపడుతున్నది. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గంలో కేటాయించిన ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. ఇందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులకు అందించిన వాహన వివరాల నమోదుకు మార్చి 1 నుంచి ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకు హుజూరాబాద్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా మూడు విడుతల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి డీ సురేశ్ వెల్లడించారు.
కరీంనగర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లూ దగా పడ్డ దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించింది. ఏడాదిన్నర కిందట హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులను ఎంపిక 18,021 కుటుంబాలకు యూనిట్లను కేటాయించింది. అయితే, వారు ఈ యూనిట్లను సద్వినియోగం చేసుకొనేందుకు చర్యలు చేపడుతున్నది. లబ్ధిదారులు పొందిన ఆస్తుల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేపట్టింది. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలు, హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో పాడి యూనిట్లు 2,327, తయారీ రంగం 409, రిటైల్ రంగం 2,624, సేవలు, సరఫరా రంగం 3,810, రవాణా రంగం 8,850 మొత్తంగా 18,021 యూనిట్లు ఇచ్చారు. ఇందులో వాహనాలు మినహాయిస్తే మిగతా రంగాలకు సంబంధించి ఆస్తుల నమోదు ప్రక్రియను క్లస్టర్ అధికారులు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి నేరుగా యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.
యూనిట్ ఫొటో, లబ్ధిదారుల వివరాలు, బిల్స్ తనిఖీలు చేసి నిక్షిప్తం చేస్తున్నారు. వాహనాలు మినహా మిగతా రంగాల్లో పంపిణీ చేసిన యూనిట్ల నమోదు శరవేగంగా సాగుతున్నది. పాడి యూనిట్లు దాదాపుగా లబ్ధిదారులు ఇండ్లలోనో, వ్యవసాయ భూముల వద్దనో ఏర్పాటు చేసుకున్న షెడ్లలోనే ఉన్నాయి. తయారీ రంగంలో నెలకొల్పుకున్న చిన్న తరహా పరిశ్రమలు, రిటైల్, సేవా, సరఫరా రంగాల్లో వ్యాపారాలు నిర్వహించుకునే లబ్ధిదారులు సదరు యూనిట్లను ఎక్కడ నెలకొల్పుకుంటే అక్కడికి వెళ్లి క్లష్టర్ అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద ఎక్కువగా వాహనాలను పంపిణీ చేశారు. 18,021 యూనిట్లలో 8,850 యూనిట్లు వివిధ వాహనాలే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధంగా హార్వెస్టర్లు, వరి నాటు యంత్రాలు, ట్రాక్టర్లతోపాటు కార్లు, మినీ బస్సులు, ఆర్టీసీ అద్దె బస్సులు, భారీ టిప్పర్లు, ప్యాసింజర్, ట్రాలీ ఆటోలు ఇలా భారీ సంఖ్యలో వాహనాల పంపిణీ చేశారు. అయితే క్లస్టర్ అధికారులు యాప్లో అప్లోడ్ చేసేందుకు వెళ్లినపుడు లబ్ధిదారుల ఇంటి వద్ద వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ర్టాల్లో వాహనాలు తిరుగుతున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో అధికారులు ఎన్ని సార్లు వెళ్లినా కొన్ని వాహనాలు అందుబాటులో ఉండడం లేదు.
ఈ నేపథ్యంలో వెహికిళ్ల వివరాలను అప్లోడ్ చేసేందుకు అధికారులు యాప్ అసెట్స్ అప్లోడింగ్ మేళా పేరిట ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇల్లందకుంట, జమ్మికుంట మండలాలకు సంబంధించిన వారికి ఈ నెల 20న హుజూరాబాద్లో శిబిరం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హాజరయ్యారు. వాహనాలు పొందిన 600 మందికి కేవలం 220 మంది మాత్రమే ఆస్తులను యాప్లో అప్లోడ్ చేయించుకున్నారు. ఇంకా 2,273 వాహనాలను యాప్లో వివరాలు పొందుపరచాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మూడు విడుతల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి డీ సురేశ్ తెలిపారు. జమ్మికుంట రూరల్లో 597, జమ్మికుంట మున్సిపాలిటీలో 360 వాహనాల వివరాలు అప్లోడ్ చేసేందుకు మార్చి 1న, హుజూరాబాద్ రూరల్లో 588, హుజూరాబాద్ మున్సిపాలిటీలో 221 వాహనాలకు మార్చి 3న, వీణవంకలోని 336, ఇల్లందకుంటలోని 171 వాహనాలకు మార్చి 9న అవకాశం ఇచ్చారు.
హుజూరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిబిరాలకు క్లస్టర్, టీఎస్ ఆన్లైన్, ఆర్టీఏ అధికారులు కూడా హాజరవుతున్నారు. దళిత బంధులో వాహనాలు పొందిన ఎందరో లబ్ధిదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్తోనే వాహనాలను తిప్పుతున్నారు. వివిధ జిల్లాల్లో, రాష్ర్టాల్లో ఆర్టీఏ అధికారులకు చిక్కితే ఫైన్లు వేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాహనాలకు ఈ శిబిరాల్లో సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికీ తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో నడుస్తున్న వాహనాలకు ఈ శిబిరాల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేస్తున్నారు. లబ్ధిదారులు ఒక్క రోజు సమయం కేటాయించి తమ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దళితబంధు యాప్లో వాహనాల వివరాలను అప్లోడ్ చేసుకుంటే దళిత రక్షణ నిధిలో ఆయా లబ్ధిదారుల వాటా రూ. 10 వేలతోపాటు వారి పేరిట ప్రభుత్వం మరో రూ. 10 వేలు జమ చేస్తోంది. ఈ అవకాశం కూడా ఈ క్యాంపుల్లో కల్పిస్తున్నారు. వాహనాలు ఎక్కడ తిరుగుతున్నా వారికి ఇచ్చిన సమయంలో వచ్చి సహకరిస్తే లబ్ధిదారులకే మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు..
దళిత బంధులో వాహనాలు పొందిన లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ లేకుండా నడపడం సరికాదు. ఈ నేపథ్యంలో వాహనాల వివరాల నమోదుకు స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలతో క్లస్టర్, ఆర్టీఏ, టీఎస్ ఆన్లైన్ అధికారులు అందుబాటులో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలకు ఇక్కడే స్లాట్ బుకింగ్ చేస్తున్నాం. ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే దళిత రక్షణ నిధి వర్తిస్తుంది. మార్చి 1, 3, 9 తేదీల్లో హుజూరాబాద్లోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే స్పెషల్ క్యాంపులకు హాజరుకావాలి.
– డీ సురేశ్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి