హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకే నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 30న పోలింగ్ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, పోలింగ్ కేంద్రాల్లోని సిబ్బంది మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌజ్లు ధరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చూడాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఓటు వేసే కుడి చేతికి గ్లౌజ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏఎన్ఎం, హెల్త్ వర్కర్ను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్లు, థర్మల్ స్కానర్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.
ఎన్నికల ప్రచారం నియామవళిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల తర్వాత ధూంధాంలు, డ్యాన్సులు నిర్వహించరాదని, ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. పోలింగ్కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగుస్తుందని చెప్పారు. పోలింగ్ సిబ్బంది తప్పని సరిగా డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.