కోరుట్ల : యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమించి పెళ్లాడిన భర్త భార్యను అదనపు కట్నం కోసమే హత్య ( Murder ) చేశాడని పోలీసులు నిర్దారించారు. హత్యకు సంబంధించిన వివరాలను కోరుట్ల పట్టణంలోని పోలీస్టేషన్లో మెట్పల్లి డీఎస్పీ రాములు( DSP Ramulu ) , కోరుట్ల సీఐ బుధవారం వెల్లడించారు.
కోరుట్ల మండలంలోని మాదాపూర్కు చెందిన గంధం దుర్గా ప్రసాద్, రాణి దంపతుల కూతురు వైష్ణవి( Vaishnavi -20 ) కొంతకాలంగా యూట్యూబ్ ( You tube ) ద్వారా వీడియోలు రూపొందిస్తూ పేరు తెచ్చుకుంది. 10 నెలల క్రితం కోరుట్లలోని ఏస్కోనిగుట్ట కాలనీకి చెందిన చిత్తరి హరిబాబుతో స్నేహం కుదిరి అది కాస్తా ప్రేమగా మారింది. హరిబాబు తల్లిదండ్రులు వివాహ విషయమై మాట్లాడేందుకు వచ్చి కట్న కానుకలు ఇవ్వాలని కోరగా, వైష్ణవి తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని స్థితిలో ఉన్నామని తెలిపారు.
కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని హరిబాబు తల్లి ఒత్తిడి తేవడంతో గతంలో హరిబాబు విషం సేవించి ఆత్మహత్యయత్నం చేశాడు. హరిబాబు కోలుకొని వైష్ణవిని పెళ్లి చేసుకుంటానని ఇరు కుటుంబాలను నచ్చజెప్పినా వినకపోవడంతో పెద్దలను ఎదిరించి 2025 మే 29న వెంకటాపూర్ గ్రామశివారులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లోని దంపతులు అత్తవారింటిలోనే ఉంటున్నారు.
కొద్ది రోజుల తర్వాత హరిబాబు కట్నం విషయం ప్రస్తావించగా వైష్ణవి తల్లిదండ్రులు రూ. 5 లక్షలు కట్నం రూపంలో రెండు గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. కొద్దిరోజులుగా అదనంగా మరో రూ.5 లక్షలు కట్నం తేవాలని హరిబాబు, తల్లి లక్ష్మీ, అన్నలు ఆనంద్, అశోక్ తోడై భార్య వైష్ణవిని శారీరకంగా, మానసికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. ఈ దశలో వైష్ణవి నాలుగు నెలల గర్భం దాల్చినా వరకట్న వేధింపులు ఆగలేదు.
ఈ నెల 17న వైష్ణవిని భర్త హరిబాబు చంపి పరారయ్యాడు. వైష్ణవి గదిని తల్లిదండ్రులు తెరిచి చూడగా, కూతురు మంచం పక్కన రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి ఆమెను కోరుట్లలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కోనారావుపేట ఎక్స్ రోడ్డు వద్ద నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు. మీడియా సమావేశంలో ఎస్సై చిరంజీవి, పోలీస్ సిబ్బంది, తదితరులున్నారు.