ఒకప్పుడు సిజేరియన్ డెలివరీల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. జిల్లాలో హుజూరాబాద్ ముందు వరుసలో నిలిచేది. ఈ క్రమంలో ప్రభుత్వ కృషి, వైద్యుల పట్టుదలతో పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో ఒకప్పుడు 5 శాతానికే పరిమితమైన సాధారణ కాన్పుల సంఖ్య నేడు 40 శాతానికి పెరిగింది. ఇది సాధారణ కాన్పుపై గర్భిణుల్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తున్నది.
-హుజూరాబాద్, జూన్ 11
సమైక్య పాలనలో హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో నెలకు 40 డెలివరీలు మించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ప్రతినెలా వీటి సంఖ్య సరాసరి 150కి తగ్గడం లేదు. కొన్ని సమయాల్లో దవాఖానలో బెడ్ దొరకని సందర్భాలున్నాయి. సాధారణ కాన్పుల సంఖ్య పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో 40 శాతం సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. మార్చిలో మొత్తం 125 ప్రసవాలు జరుగగా, ఇందులో మొదటి కాన్పు కోసం చేరిన 47 మందిలో 21 మందికి వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. ఏప్రిల్లో మొత్తం 154 డెలివరీలు జరుగగా, ఇందులో మొదటి ప్రసవం కోసం చేరిన 41 మందిలో 18 మందికి వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. మేలో మొత్తం 143 కాన్పులు జరుగగా, ఇందులో మొదటి ప్రసవం కోసం చేరిన 43 మందిలో 26 మందికి వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు.
ప్రత్యేక వ్యాయామం, యోగాసనాలు
సాధారణ కాన్పు తల్లీబిడ్డకు ఆరోగ్యపరంగా సురక్షితం కావడంతో వాటిని పెంచే దిశగా కేసీఆర్ సర్కార్ ప్రయత్నం మొదలు పెట్టింది. ఇందుకోసం సర్కార్ దవాఖానల్లో మిడ్వైఫ్ లెడ్ కేర్ యూనిట్లను నెలకొల్పారు. వీటిలోని సిబ్బంది సాధారణ కాన్పు జరుగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను అందిస్తున్నారు. ఇందులో ప్రధానమైనవి ప్రత్యేక వ్యాయామం, యోగా. డెలివరీ అయ్యేవరకు ఏనెలలో ఏ ఆసనం వేయాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో గర్భిణులకు నేర్పిస్తారు. తద్వారా నార్మల్ డెలివరీ సులువుగా చేస్తున్నారు.
ఆకర్షిస్తున్న కేసీఆర్ కిట్
గతంలో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం అంతంతమాత్రంగానే ఉండేది. ఆర్థిక స్థోమత లేకున్నా ఎక్కువ శాతం మంది గర్భిణులు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రసవాలకే మొగ్గుచూపేవారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో మార్పు మొదలైంది. ప్రభుత్వ దవాఖానలో ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కేసీఆర్ కిట్ అందించడం చాలా మందిని ఆకర్షించింది. తద్వారా కాన్పు కోసం వస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది.
ఈమె పేరు నాగరాణి శంకరపట్నం మండలం మొగిలిపాలెం. ప్రసవానికి నెలలు నిండడంతో హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లింది. అక్కడ ఆపరేషన్ చేస్తాం.. అడ్మిట్ కావాలని చెప్పడంతో విముఖత చూపింది. నార్మల్ డెలివరీకి కోసం హుజూరాబాద్ దవాఖానలో చేరింది. పరీక్షలు చేసిన వైద్యులు పురిటి నొప్పులు లేకపోవడంతో మరోనాలుగు రోజులు ఆగమని సూచించారు. ఇంటి దగ్గర చేయాల్సిన యోగాసనాల గురించి చెప్పి పంపించారు. సరిగ్గా నాలుగు రోజులు తర్వాత వచ్చిన నాగరాణికి వైద్యులు సాధారణ కాన్పు చేశారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు.
ఎలాంటి ఇబ్బందీ లేదు
నార్మల్ డెలివరీతో కలిగే ప్రయోజనాల గురించి ఆశ వర్కర్లు, నర్సులు చెప్పారు. నెలలు నిండడంతో ప్రభుత్వ దవాఖానకు వెళ్లిన. పరీక్షలు చేసిన డాక్టరమ్మ నార్మల్ డెలివరీ చేసింది. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్ హాస్పిటల్కు పోతే రూ.50వేలకు తక్కువగా కాకపోవు. సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి అంబులెన్సులో ఇంటి దగ్గర దింపారు.
– శ్రీవిద్య, మర్రిపల్లిగూడెం
నార్మల్ డెలివరీతో తల్లీబిడ్డా క్షేమం
నార్మల్ డెలివరీతో తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారు. మొదటి కాన్పుకు వచ్చే ప్రతి గర్భిణికీ సాధారణ కాన్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. నార్మల్డెలివరీతో కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యేక ఎక్సర్సైజ్లతో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-రాజేందర్రెడ్డి, సూపరింటెండెంట్, హుజూరాబాద్ దవాఖాన
ఆపరేషన్ కోసం తొందరపడొద్దు
పురిటి నొప్పులు వస్తేనే డెలివరీ చేయాలి. ముఖ్యంగా నార్మల్ డెలివరీ జరుగాలంటే పురిటి నొప్పులు వాటికవే రావాలి. 37- 40 నెలల మధ్యలో ఎప్పుడైనా నొప్పులు రావచ్చు. తొందరపడి ఆపరేషన్ చేయించుకోవద్దు. ఒకప్పటితో పోల్చితే ఇప్పడు సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
-దీప్తి, గైనకాలజిస్టు, హుజూరాబాద్ దవాఖాన