కార్పొరేషన్, జనవరి 20: రేకుర్తిలో జరిగే సమ్మక-సారలమ్మ జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బల్దియా నిధులు రూ.1.30 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన మేయర్ వై సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం 17వ డివిజన్లో రూ. 81 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రేకుర్తి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎస్సారెస్పీ డీ-94 కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని చెప్పారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మిస్తామని పేర్కొన్నారు. రూ. 13.65లక్షలతో జాతర గద్దెల నుంచి జగిత్యాల ప్రధాన రహదారి వరకు మట్టి రోడ్డు, రూ. 4.20 లక్షలతో తాగునీటి వసతి, రూ. 4.65 లక్షలతో స్నాన ఘట్టాలు, రూ. 2.3 లక్షలతో బోరుబావి తదితర వసతులు కల్పిస్తామన్నారు. అలాగే రూ. 25 లక్షలతో సమ్మక్క గద్దెల వద్ద రాక్కటింగ్, రూ. 43 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. రూ. 11.55 లక్షలతో లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీ-హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, కోల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
స్మార్ట్సిటీ పనుల్లో వేగం పెంచాలి
నగరంలో స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. స్థానిక బల్దియా కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఆయన మేయర్ వై సునీల్రావుతో కలిసి ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, ఇతర విభాగాల అధికారులతో స్మార్ట్సిటీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ బోర్డు ద్వారా అడ్మినిస్ట్రేషన్ మంజూరు పొందిన పనులను మార్చి 31లోగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. లేకపోతే స్మార్ట్సిటీ కింద వచ్చిన నిధులు తిరిగి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. స్మార్ట్సిటీ కింద రూ. 960 కోట్ల పనులకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు వచ్చాయని, ఈ పనులన్నింటికీ ఈ నెలఖారులోగా డీపీఆర్లను సిద్ధం చేసి, ఫిబ్రవరిలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మార్చిలో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ ఎక్కడ నిర్లక్ష్యం చూపించవద్దని ఆదేశించారు.
గణేశ్నగర్ బైపాస్, రాజా థియేటర్ నుంచి శనివారం మార్కెట్ రోడ్డు, నాకా చౌరస్తా నుంచి పాత పవర్ హౌస్ వరకు ఉన్న రోడ్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేయాలన్నారు. కేబుల్ బ్రిడ్జి వద్ద చౌరస్తాతో పాటు పవర్ హౌస్ చౌరస్తాలను సుందరీకరణ చేయాలన్నారు. వీటితో పాటు నగరంలోని పలు చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో సమీకృత మార్కెట్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పద్మనగర్, ఆర్టీసీ వర్క్షాపు వద్ద స్థల కేటాయింపునకు సంబంధించి కలెక్టర్ మాట్లాడుతామని, వాటికి కూడా అతి త్వరలో డిజైన్ సిద్ధం చేసి టెండర్లు పిలువాలని సూచించారు. భారత్ థియేటర్ రోడ్డు నుంచి రూరల్ పోలీస్ సేష్టన్ మీదుగా బొమ్మ వెంకన్న ఇంటి వరకు వచ్చే రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. స్మార్ట్సిటీ రోడ్లపై దుమ్ము లేకుండా పారిశుధ్య పనులు మెరుగుపర్చాలన్నారు. మరో రెండు స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, ఎస్ఈ నాగమల్లేశ్వర్రావు, కార్పొరేటర్లు, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, పారిశుధ్య విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.