కలెక్టరేట్, ఆగస్టు 14: బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆరోపించారు. దేశానికి స్వాతం త్య్రం సిద్ధించిన నుంచి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేయలేదని విమర్శించారు. తమ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీనిపై విమర్శలు చేయడంతోనే దేశవ్యాప్తంగా అన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేశారని తెలిపారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయం దారుసలాంలో విలేకరులతో మాట్లాడారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సంస్థకు ఎందుకు సూచన చేయలేకపోయారని ప్రశ్నించారు. జాతీయ పతాకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల శ్రేయస్సు కోసం, స్వదేశీ ఉత్పత్తులను వాడాలనే సంకల్పంతో సిరిసిల్లలో జాతీయ పతాకాలను తయారు చేయించడం ఆయన దేశభక్తికి నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం విద్య, ఉద్యోగ, ఉపాధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.
ఏటా లక్షలాదిమంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేస్తూ దేశానికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఈనెల 17వ తేదీన స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఎంఐఎం జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, బ్లడ్ గ్రూప్ టెస్ట్ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిషరణతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, కవులు, క్రీడాకారులను సన్మానించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఎంఐఎం ప్రధాన కార్యదర్శి సయ్యద్ బరత్ అలీ, కార్పొరేటర్ సయ్యద్ అలీబాబా తదితరులున్నారు.