Jagityal | జగిత్యాల, మార్చి 14 : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై బూతు పదాలు వాడినందుకు క్షమాపణలు చెప్పాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం తహసిల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గాంధీభవన్లో 12న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణకు ఎస్సీ సెల్ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం జరిగిన సభలో బ్రాహ్మణులు మానకొండూరు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం చేశారని చెప్పారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ బాపనోళ్లు చదివిన మంత్రాల్లో బూతు పదాలు పలికారని పేర్కొన్నారు. ఈ సభలో అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తదితర మంత్రులు, పలువురు దళిత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బహిరంగంగా వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా వేద ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులను పరుష పదజాలంతో ఆయన మాట్లాడడం సరి కాదని అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ వేద ఆశీర్వచనం చేసి శతమానం భవతి లాంటి వేదవాక్కులు పలికిన బ్రాహ్మణులను వేదాలను కించపరిచే విధంగా మాట్లాడాన్ని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సభలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వింటూ ఉండగా ఇలాంటి పరుష పదాలు వాడిన వ్యక్తిని ఎవరు కూడా అడ్డుకోలేకపోవడం ఇది హిందూ ధర్మం దౌర్భాగ్యం అని అన్నారు.
ఏ మతంలో అయినా ఆశీస్సులు అందజేసేటప్పుడు తిట్ల పురాణం ఉండదని అన్ని మతాలు మంచినే బోధిస్తాయని తుంగతుర్తి ఎమ్మెల్యే తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి తాము వెనుకాడమని కరాకండిగా తెలిపారు. ప్రతీ బ్రాహ్మణుడు లోకాసమస్తా సుఖినోభవంతు అందరూ బాగుండాలని ప్రతినిత్యం కోరుకుంటారని అలాంటి బ్రాహ్మణులను దుర్భాషలాడడం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆ పదవికి ఆయన అనర్హుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మౌనంగా ఉంటే వారు హిందూ ధర్మానికి వ్యతిరేకులని ముద్రపడే అవకాశం ఉందని ఇది గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఎవ్వరైనా తమ పదవిని చూసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడితే వాళ్లకు సరైన బుద్ధి చెప్పే సామర్థ్యం తమకుందని బ్రాహ్మణ సంఘం నాయకులు మరోసారి హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆది జాంబవ పరియోజన ప్రాంత ప్రముఖ అలగుర్తి లక్ష్మీనారాయణ బ్రాహ్మణ సంఘ నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడుతూ బీసీ సీ గ్రూపుకు చెందిన వ్యక్తి తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ఎస్సీ సర్టిఫికెట్ తో ఎమ్మెల్యేగా గెలుపొందారని, మొట్టమొదట ఆయన రాజీనామా చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీనివల్ల దళిత జాతికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వేదాల అర్థం తెలుసుకొని మాట్లాడాలని మందుల సామెల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మోతే ఉమాకాంత్ శర్మ, నాయకులు సిరిసిల్ల రాజేందర్ శర్మ, సురేష్ శర్మ, సంగనభట్ల గుండయ్య శర్మ, మేడిపల్లి శ్రీనివాస్ శర్మ, నేరెళ్ల శ్రీనివాస్ చారి, మెట్ట కిరణ్ భాస్కర్ శర్మ, కొత్తపల్లి శ్రీనివాస్ శర్మ, గుండి శ్రీనివాస్ శర్మ, కొత్తపెల్లి రాజశేఖర్, రుద్రాంగి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.